తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 అర్ధరాత్రి 12:01 గంటలకు నిరంతర సరఫరాను ప్రారంభించి.. రైతాంగానికి నూతన సంవత్సర కానుక అందించబోతున్నారు.24 గంటల విద్యుత్ సరఫరాపై నవంబర్ 6 నుంచి 20వ తేదీ వరకు 15 రోజులపాటు చేసిన ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే.మొత్తంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తో తెలంగాణ దేశ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించబోతోంది.
కరెంటు గోస తీరడం సంతోషకరం.. సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ సమయంలోనే విద్యుత్ సరఫరాలో మెరుగైన ఫలితాలు సాధించిందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. అన్ని వర్గాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి పెరిగిందన్నారు.
‘‘దశాబ్దాల తరబడి రైతులు కరెంట్ గోసలు అనుభవించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడ ఈ కష్టాలు కొనసాగడం అర్థరహితమని భావించాం. అందుకే విద్యుత్ సరఫరా మెరుగుదలకు ప్రాధాన్యం ఇచ్చాం. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడాన్ని గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. రైతులకు మేలు చేయడం కన్నా మించిన సంతృప్తి మరొకటి ఉండదు. రైతులతో పాటు అన్ని వర్గాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా విద్యుత్ సంస్థలు, ఉద్యోగులు పనిచేశారు. దాని ఫలితంగానే ఇప్పుడు మనం అన్ని వర్గాలకు 24 గంటల పాటు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించే రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించుకుంటున్నాం. విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉంటేనే పరిశ్రమలు తరలివస్తాయి. పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. రైతులకు సాగునీరు, ప్రజలకు మంచినీరు ఇవ్వడం సాధ్యమవుతుంది. విద్యుత్ తోనే అభివృద్ధి, మెరుగైన జీవితం ఆధారపడి ఉంది. అందుకే ప్రస్తుత అవసరాలు తీరడంతో పాటు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి పెంచుతున్నాం. ఇక ఇప్పుడు తెలంగాణ కరెంట్ కోతలంటే ఏమిటో తెలియని రాష్ట్రంగా మారింది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.