2017 సంవత్సరానికి గుడ్ బై చెప్తున్న నేపథ్యంలో గడిచిన సంవత్సరంలో తామేం చేశామో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రాంమ్మోహన్ వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానంలో నిలవడంలో జీహెచ్ఏంసీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. డబుల్ బెడ్ రూంల ఇళ్ళ నిర్మాణం శరవేగంగా సాగుతుందని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నామని తద్వారా 22వేల మంది సిబ్బందికి బయోమెట్రిక్ అమలుచేస్తున్నామని మేయర్ అన్నారు.
ఏరియా, వార్డు కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు భాగస్వామ్యం కల్పించినట్లు మేయర్ తెలిపారు. భవన నిర్మాణంలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఆన్ లైన్ అనుమతులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. నాలాల విస్తరణ కోసం 230కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పాదాచారుల బాటను నిర్మాణం మొదలుపెట్టినట్లు వివరించారు. 43 కోట్లతో 117 జంక్షన్ల అభివృద్ధి చేస్తున్నామన్నారు. గ్రేటర్ లో 4.54లక్షల సంప్రదాయ వీధి దీపాల స్ధానంలో ఎల్ఈడీ బల్బులు అమర్చామని వివరించారు. 40మోడల్ మార్కెట్లు నిర్మాణం చేసినట్లు మేయర్ తెలిపారు.
రూ.30కోట్లతో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణం చేపట్టామని…24 స్మశానవాటికలను అబివృద్ది చేస్తున్నామని మేయర్ తెలిపారు. 30గణేష్ నిమజ్జన కొలనులు నిర్మించామన్నారు. 94కోట్లతో 63 చెరువులను అబివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. రూ. 13కోట్లతో మత్స్య మార్కెట్ నిర్మించామన్నారు. రూ. 4కోట్లతో జవహర్ నగర్ తో పాటు 12గ్రామాలకు త్రాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. భవన నిర్మాణ వ్యర్థాల రీ సైక్లింగ్ కు ప్లాంట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ-లైబ్రరీల ఏర్పాటు, మై జీహెచ్ఏంసీ యాప్ ప్రారంభించామన్నారు. స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా రెండు వేల చెత్త సేకరణ టిప్పర్ల పంపిణీ చేశామన్నారు. మా ఇంటి నేస్తంలో భాగంగా 1617 కుక్కలను దత్తత తీసుకున్నామన్నారు.