తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న 24 గంటల విద్యుత్తుకు ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువెత్తుతున్నాయి. 24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్న మొదటి రాష్ట్రంగా చరిత్రకెక్కిన తెలంగాణను అన్ని రాష్ర్టాలు అభినందిస్తున్నాయి. దేశ యవనికపై తెలంగాణ ప్రొఫైల్ గ్రాఫ్ విపరీతంగా పెరగడం విశేషం.
వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు 24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫోన్ చేసి వివరాలు కనుక్కుంటున్నారు. గుజరాత్ లాంటి పెద్ద, అభివృద్ధి చెందిన రాష్ట్రాలు సైతం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై ప్రత్యేక ఆసక్తి కనబర్చడం విశేషం. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 24 గంటల విద్యుత్తు సరఫరా సమాచారం ఆరాతీస్తుండటం గమనార్మం. ఇలా 24 గంటల కరెంటు సరఫరా చెయ్యొచ్చనే సలహా తమకు ఎందుకు ఇవ్వలేదని వివిధ రాష్ట్రాల సీఎంలు వాళ్ళ అధికారులను ప్రశ్నిస్తున్నట్లు అధికారులు అంటున్నారు. క్షేత్ర స్థాయిలో ఏవైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అని ఆరాతీస్తున్నారు. వివిధ రాష్ట్రాల బృందాలు త్వరలో రాష్ట్రాన్ని సందర్శించే అవకాశం ఉంది.