అన్నదాతల సంక్షేమం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి మరో ప్రశంస దక్కింది. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న సీఎం కేసీఆర్ ను ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన అభినందన లేఖ రాశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నందుకు తెలంగాణ రైతుల తరపున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
నీటి ఎద్దడి ఎక్కువగా ఉండి, బోరుబావులపై ఆధారపడే తెలంగాణ రైతాంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా ఎంతో ఉపయోగపడుతుందని స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. పంటనష్టం లేకుండా సాగునీటిని అందుబాటులో ఉంచడం వల్ల వ్యవసాయ రంగం వృద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, తెలంగాణ ప్రజలకు స్వామినాథన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.