ప్రియుడి మోజులో పడి భర్తలను చంపుతున్న ఘటనలు ఈ మధ్య ఒకటి తరువాత ఒకటిగా బయటపడుతున్నాయి. మొన్న నాగర్ కర్నూల్ జిల్లాలో స్వాతి ప్రియుడి మోజులో పడి భర్త సుధాకర్ను చంపింది. ఈ ఘటన మరవకముందే హైదరాబాద్ కర్మాన్ఘాట్ లో కార్పెంటర్ నాగరాజు, నల్లగొండలో భారతి, గుంటూరులో శ్రీవిద్య.. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దైవదర్శనానికి అని తీసుకొచ్చి గొంతుకోసి చంపేసింది.అసలు వివరాల్లోకి వెళ్తే..
సిద్దిపేట జిల్లా ఘణపూర్కు చెందిన బండి బాలయ్య(40) నర్సవ్వ భార్యాభర్తలు. వీరికి శైలజ(17), అంజలి(7) కూతుళ్లు. జీవనోపాధి కోసం గల్ఫ్లో గడిపిన బాలయ్య 20 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. గల్ఫ్ వెళ్లబోనని, ఇక్కడే ఉండి ఏదైనా పనిచేసుకుని కుటుంబాన్ని పోషిస్తానని భార్య నర్సవ్వకు చెప్పాడు. అప్పులున్నాయని, కచ్చితంగా మళ్లీ వెళ్లాలని నర్సవ్వ పట్టుబట్టింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అయితే గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే భర్తను తిరిగి గల్ఫ్ వెళ్లాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆరోపణలున్నాయి.భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్న నర్సవ్వ.. ఓ పథకాన్ని రచించింది. పిల్లలిద్దర్నీ ఇంటి వద్దే ఉంచి దైవదర్శనం కోసమని ఆదివారం వేములవాడకు భర్తతో కలిసి వచ్చింది.
రద్దీ ఎక్కువ ఉండటంతో గది అద్దెకు తీసుకోలేకపోయారు. దీంతో ఆలయ గుడి చెరువు ప్రాంతంలో వీఐపీ పార్కింగ్ స్థలంలో బస చేశారు. ఇద్దరూ కలిసి మద్యం కూడా సేవించినట్లు సమాచారం. ఈ క్రమంలో రాత్రి 10 గంటల సమయంలో గొడవ పడ్డారని యాత్రికులు తెలిపారు. అనంతరం రాత్రి దాదాపు 11 గంటలు దాటిన అనంతరం నిద్రలో ఉన్న భర్త బాలయ్యను వెంట తెచ్చుకున్న కత్తితో బలంగా గొంతు కోసింది. బాలయ్య గట్టిగా అరవడంతో సమీపంలోని భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే బాలయ్య రక్తపుమడుగులో పడి ఉన్నాడు. నర్సవ్వను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
కాగా, సంఘటన స్థలంలో పోలీసులు రెండు పదునైన కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రెండు కత్తులు దొరకడంతో నర్సవ్వే బాలయ్యను గొంతు కోసి హతమార్చిందా లేక ఇందులో మరెవరైనా సహకరించారా అనే కోణంలో విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి బంధువులకు అప్పగించారు. వారు శవంతో వెంకటరెడ్డి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. తండ్రి శవాన్ని చూసి ఇద్దరు కూతుళ్లు కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదనలు మిన్నంటాయి.