ఏపీలో గత మూడు రోజులుగా జరుగుతున్న కోడిపందాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కోడి ఒకరిది.. పందెం మాత్రం అందరిది. కాయ్ రాజా కాయ్ మంటూ లక్షలు, కోట్లలో బెట్టింగ్లు. గెలిచారో అక్కడికక్కడే పార్టీ. పక్కనే కక్కా-ముక్కా రెడీ. ఓడారో.. పోయిన కాడికి పోతుంది. ఆ అనుభవంతో.. మరో పందానికి సై. లక్ష్మీదేవీ తలుపుతట్టేదాక నాన్స్టాప్ బెట్టింగ్. పగలైనా, రాత్రైనా అక్కడే. ఎనీ టైమ్ పందెం. కోస్తాలో మూడు రోజులుగా ఇదే ఫీవర్. ఏకంగా ఐపీఎల్ బెట్టింగ్లను మించిపోయాయని వార్తలు వస్తున్నాయి.
మూడు రోజుల్లో వెయ్యి కోట్ల మేర పందాలు కాసినట్టు లెక్కలు కడుతున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో డే అండ్ నైట్ సాగుతున్న పందాలు.. కనుమ నాడు తారాస్థాయికి చేరాయి. పోలీసులు భోగి నాడు కాస్త హడావుడి చేసినా..ఆ తర్వాత పొలిటికల్ లీడర్లు ముఖ్యంగా అధికార పార్టీ జోక్యంతో సైడ్ అయిపోయారు. దీంతో జాతరను తలపించేలా విశాలమైన బరులు.. స్టేడియాలను తలపించే పార్కింగులు.. క్యాసినోలను మరిపించే గ్యాంబ్లింగ్ ఆటలు.. కోస్తాలో ఈసారి కోడిపందాల జోరు మామూలుగా లేదని అంటున్నారు.
మరోవైపు ఈ మూడు రోజుల కోడిపందాల్లో దాదాపు వెయ్యి కోట్లు చేతులు మారినట్టు లెక్కలేస్తున్నారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే తొలి రెండు రోజుల్లోనే రెండు వందల కోట్ల బెట్టింగ్ సాగిందంటున్నారు. కనుమ నాడు ఈ లెక్క.. రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాల్లో కోడిబరులు కొనసాగుతున్నాయి. స్థానికులతో పాటు యానాం, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచే కాక.. విదేశీయులు సైతం పందాల్లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్ కంటే… కోస్తా కోడిపందాలు ఎక్కువగా చేతులు మారాయని చెప్తున్నారు.