తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇవాళ ( శనివారం ) కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఉదయం 8.40గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు సమీపంలోని కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న గవర్నర్… అక్కడ నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని సతీమణితో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కన్నెపల్లి పంప్ హౌస్కు చేరుకుని నిర్మాణ పనులను పరిశీలించారు. మేడిగడ్డ ఆనకట్టను నరసింహన్ విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రాజెక్టు పనులను గవర్నర్కు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.
గవర్నర్ వెంట స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి హరీష్రావు,స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు , ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ వెంకటేశ్వర్లు, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తదితరులు ఉన్నారు.