తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్, తెలంగాణ జనసమితి నాయకుడు కోదండరాం తాజాగా చేసిన కామెంట్లు ఆశ్చర్యకర రీతిలో ఉన్నాయని చర్చ జరుగుతోంది. బిడ్డ పుట్టకముందే కుల్ల కుట్టిన చందంగా ఆయన సీఎం పీఠం గురించి కామెంట్లు చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ కీలక శక్తిగా ఎదగడం, ముఖ్యమంత్రి పీఠాన్ని ఆ పార్టీ నాయకుడు కుమారస్వామి కైవసం చేసుకోవడం తెలిసిన సంగతే. అయితే ఇదే లెక్కతో తనే కింగ్ అవుతానని కోదండరాం ప్రకటించారు.
తాజాగా హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన కోదండరాం రానున్న ఎన్నికల్లో తెలంగాణ జనసమితి కింగ్ మేకర్ కాదు కింగే అవుతుందన్నారు. తెలంగాణ లో హాంగ్ రాదని, ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇస్తారని జోస్యం చెప్పారు. రాజకీయ పద్ధతులను మేము మారుస్తామన్నారు. 119 స్థానాల్లో జనసమితి ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. కాగా, తెలంగాణ జనసమితికి ఇప్పటికీ పూర్తిస్థాయి నిర్మాణమే లేదని, మండలాల స్థాయి వరకు కూడా విస్తరించని పార్టీ..ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీజేఎస్ నేతలే చర్చించుకుంటున్నారు. మాస్టారి ఆశలు భారీగా ఉన్నాయని, అవి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయంటున్నారు.