తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని 80 నుండి 90 శాతం భూభాగానికి నీరందించే ప్రాజెక్ట్ గా చరిత్రలో నిలువనున్నది. నిర్మాణదశలో వున్న ఈ ప్రాజెక్టు ఇప్పటికే అన్ని రకాల అనుమతులు వచ్చాయి.అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ కు దేశ నలుమూలల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి.అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశానికే ఆదర్శంగా నిలువబోతున్నదని కేంద్ర జలవనరులశాఖ ఎక్స్ అఫీషియో అదనపు కార్యదర్శి వైకే శర్మ అన్నారు . శనివారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పనులను చూసి ప్రశంసించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్టు ఒక అద్భుతమనీ, డిసెంబర్లోగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్ ఇంజినీర్లు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అభినందించారు. ప్రాజె క్టు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టువైపు దేశం మొత్తం చూస్తున్నదని తెలిపారు.