టీఆర్ఎస్ పార్టీది తెలంగాన ప్రయోజనాల కోసం గలం విప్పే గుణమైతే…కాంగ్రెస్ పార్టీది విమర్శలు చేసే నైజమని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. రేపటినుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆమె వివరించారు. పార్లమెంట్లో ప్రతి చర్చలోనూ పాల్గొంటామని తెలిపారు. గత పార్లమెంటు సమావేశాల్లో రిజర్వేన్ల పెంపు, మహాత్మాగాంధీ నరేగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని డిమాండ్ చేసి..పార్లమెంటు లోపల ఆందోళన చేసిన విషయాన్ని కవిత ప్రస్తావిస్తూ..రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన వాటిలో సాధించుకోవడానికి రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
“ప్రతి ప్రాంతీయ పార్టీకి ఏదో ఒక ఎజెండా ఉంటుంది..ప్రజల సమస్యలపై మేం కూడా కేంద్రాన్ని నిలదీస్తాం. అసలు రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం నుంచి సరైన స్పందన రావడం లేదని అన్నారు ఇతర పార్టీలతో ఫ్లోర్ కోఆర్డినేషన్ ఉంటుంది“ అని ఎంపీ కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత కుంతియా ఇటీవల చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా “మాది తెలంగాణ సామాజిక వర్గం. తెలంగాణ కులం. ఉద్యమంలో కులాలు మతాల కతీతంగా పనిచేశాం ఇప్పుడు చిన్నచిన్న కమిటీలలో కూడా సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. సరైన ప్రాతినిధ్యం కోసం చైర్మన్ పదవులు కట్టబెడుతున్నారు. అది మా చిత్తశుద్ధికి నిదర్శనం“ అని ఎంపీ కవిత పేర్కొన్నారు.
నాన్ సీరియస్ పొలిటిషియన్స్ వ్యాఖ్యలపై మాట్లాడేది ఏమీ లేదని ఎంపీ కవిత స్పష్టం చేశారు. జీఎస్టీ, డీమానిటైజేషన్ అంశాల్లో కేంద్రానికి మద్దతు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రాలకు మేలు జరగాలని మా పార్టీ ఉద్దేశమన్నారు. రాష్ట్రాలకు అందించాల్సిన చేయూత విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి ఉందని అన్నారు. గత సమావేశాల్లో వైఎస్ఆర్సిపీ, టీడీపీ అవిశ్వాసం నోటీసు ఇచ్చాయని, యాక్సెప్ట్ కాలేదని తెలిపారు. ఈసారి అవిశ్వాసం నోటీస్ టేకప్ చేస్తే, ఏం చేయాలి అనే విషయమై పార్టీలో చర్చిస్తామని కవిత తెలిపారు. మా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడుగుతామన్నారు. ఇతర రాష్ట్రాలకు నిధులు ఇవ్వొద్దని చెప్పే కుసంస్కారం మాకు లేదని స్పష్టం చేశారు. “ఇన్నాళ్లు బీజేపీతో ఉన్న టీడీపీ ఇప్పుడు అవిశ్వాసం ప్రవేశపెడతామని అంటోంది.. ఏపీ నాయకులు, ఏపీ ప్రజలు ఆ పార్టీ గురించి ఆలోచించుకోవాలి. ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయని ఏం జరుగుతుందో చూద్దాం` అని అన్నారు.
దేశ ప్రజలందరికీ మేలు జరగాలన్నదే ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశమని ఎంపీ కవిత అన్నారు. ప్రాంతీయ సమస్యలు పార్లమెంటులో చర్చకు రావాల్సి ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రైతుబంధు, ఇంటింటికీ నల్ల కనెక్షన్ వంటి అవసరాలు దేశ ప్రజలకు అందించాలన్న ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ దని, ఫెడరల్ ఫ్రంట్ ఆ దిశగా కృషి చేస్తుందని తెలిపారు. బీజేపీకి గట్టి కౌంటర్ ఇవ్వలేని పరిస్తితిలో కాంగ్రెస్ ఉందని అన్నారు. పథకాల రూపకల్పనలో అవినీతికి ఆస్కారం లేని విధంగా రూపొందించారు..అందుకే వాళ్లకు మాట్లాడేది ఏమీ లేక ఏదో ఏదో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ నేతలకు కళ్ళు తిరుగుతున్నాయని అన్నారు. ఇటీవల నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో నిర్వహించిన బూత్ కమిటీ సమావేశాల్లో మా గ్రామానికి అయిదారు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారని తెలిపారు కాంగ్రెస్ హయాంలో తపస్సు చేసిన ఒకటి నుంచి రెండు లక్షల రూపాయలు ఇవ్వలేదని వారు చెప్పారని తెలిపారు. పార్టీ క్రమశిక్షణ ను అందరూ పాటించాలన్నారు. రాజ్య భ సభ్యులు డీఎస్, ఎమ్మెల్సీ భూపతి రెడ్డిల వ్యవహారాన్ని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ చూసుకుంటారని చెప్పారు. కార్యకర్తలు వారి వ్యవహార శైలిపై పడుతుతున్న బాధను అధ్యక్షుడికి తెలిపామని ఎంపీ కవిత పేర్కొన్నారు.