హైదరాబాద్ నగరంలో పెరిక కులస్తులకు భవనం నిర్మించడానికి అవసరమైన స్థలం, నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఎమ్మెల్సీ బోడకుంట వెంకటేశ్వర్లు ప్రగతి భవన్ లో గురువారం ముఖ్యమంత్రిని కలిశారు. ఖైరతాబాద్ చౌరస్తాలో తమ కులానికి అత్యంత విలువైన స్థలం, భవనం ఉండేదని, కానీ రోడ్డు వెడల్పులో చాలా భాగం కోల్పోయామని వెంకటేశ్వర్లు వివరించారు. తమ కులస్థుల సామాజిక, విద్య రంగాల్లో పురోగతికోసం కార్యకలాపాలు చేపట్టడానికి హైదరాబాద్ లో భవనం అవసరమని ఆయన వినతి పత్రం సమర్పించారు. దీనికి సిఎం సానుకూలంగా స్పందించారు. పెరిక కులస్తులకు వెంటనే స్థలం, నిధులు కేటాయించాలని చెప్పారు. దీనికోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఈటెల రాజెందర్ ను కోరారు.
