ఆయన తలచుకుంటే నాలుగేళ్లపాటు మంత్రిగా పోలీసుల చేత సెల్యూట్ కొట్టించుకుంటూ.. బుగ్గ కారులో తిరుగుతూ.. తన పోర్ట్ ఫోలియో కు సంసంధించిన రాష్ట్రవ్యాప్తంగా అధికారాలను అనుభవిస్తూ దర్జాగా బతకవచ్చు. కానీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఆమార్గాన్ని ఎంచుకోలేదు. తనకు రాజకీయంగా బిక్ష పెట్టిన కుటుంబం కష్టాల్లో ఉండటాన్ని చూడలేకపోయారు. మంత్రిపదవిని తృణప్రాయంగా వదిలేశారు. నియోజకవర్గ వాస్తవిక పరిస్థితులను అర్ధం చేసుకుని.. పార్టీ కోసం, తన నాయకుని కోసం గౌరవప్రదంగా ఎమ్మెల్యే సీటును వదులుకోవడానికి సిద్దపడుతున్నారు. ఆయన త్యాగం కచ్చితంగా ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
మనకు కనిపిస్తున్నది బోసు గారు మాత్రమే కావచ్చు. జంగా కృష్ణ మూర్తి, ప్రగాఢ నాగేశ్వర రావు (యలమంచిలి), పెండెం దొరబాబు, బొమ్మిరెడ్డి (వెంకటగిరి) వంటి కనబడని నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు మరెందరో అధినేత కోసం, పార్టీ కోసం, ఈ సారి ఎమ్మెల్యే టికెట్ లను వదులుకుంటున్నారు. జగన్ గారిని ముఖ్యమంత్రిగా చూసేందుకు ఏ త్యాగానికైనా వెనుకాడబోవడంలేదు. వారంతా పార్టీకోసమే కష్టపడుతున్నారు. అదే సెగ్మెంట్ లో వైసీపీ అభ్యర్ధికోసం పనిచేస్తున్నారు. లేదా వేరే ప్రాంతంలో పార్టీకోసం కృషి చేస్తున్నారు. అలాగే మర్రి రాజశేఖర్ కూడా పార్టీ కోసం గౌరవప్రదంగా ఒక మెట్టు దిగేందుకే సిద్ధపడుతున్నారు. ఎందుకంటే వాస్తవిక పరిస్థితులు గెలిచేందుకు అనుకూలంగా లేవు. 2004లో ఉన్న చిలకలూరిపేట నియోజకవర్గం వేరు, పునర్విభజన అనంతరం ఏర్పడిన నియోజకవర్గం వేరు. ప్రస్తుతం రాష్ట్రంలో కమ్మలు అధికంగా ఉండే నియోజకవర్గాలలో చిలకలూరిపేట కూడా ఒకటి. 2004కు ముందు దివంగత సోమేపల్లి సాంబయ్య గారు అనేక మార్లు కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించారు. టీడీపీ గాలిలో కూడా ఎమ్మెల్యేగా గెలిచారంటే కాంగ్రెస్ అనుకూల మండలాలు, సామాజికవర్గాలు నాడు నియోజకవర్గంలో ఉండడమే ప్రధాన కారణం. మర్రిరాజశేఖర్ గారు 2004లో ఇండిపెండెంట్ గా గెలిచారన్నా కూడా అదే కారణం. 2009లో ప్రజారాజ్యం ఓట్ల చీలిక, వైయస్ఆర్ గాలిలో కూడా కూడా 20వేల భారీ మెజార్టీతో ఓడిపోవాల్సిరావడానికి కారణం నియోజకవర్గాల పునర్విభజనే. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీకి కొమ్ముకాసే కమ్మసామాజిక వర్గాన్ని నమ్ముకోవడం కన్నా బీసీలకు సీటిచ్చి టీడీపీ ఓట్ బ్యాంకు వైయస్ఆర్ సీపీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడమే శ్రేయస్కరమని అధినాయకత్వం భావించివుంటుంది. ఈ కీలకసమయంలో జగన్ గారి నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కరిపై ఉంది. జగన్ ను ఇబ్బందులకు గురిచేసినవారు ఒక్కొక్కరు ఏవిధంగా అధోగతి చెందుతున్నారో అలానే ఆయన ను నమ్ముకున్నవారికి, ఆ నమ్ముకున్న వారి వెంట నడిచే కార్యకర్తలకు ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు. ఇటువంటి త్యాగాలపునాదులపైన వైఎస్సార్సీపీ నిలబడడం త్యాగం చేసిన ప్రతీ ఒక్కరకీ న్యాయం జరగడం ఖాయం. చిలకలూరిపేట విషయం లో జగన్ నిర్ణయాన్ని స్వాగతించలేక ఇబ్బంది పడుతున్న మర్రి రాజశేఖర్ అభిమానులను అనుచరులను అర్ధం చేసుకుంటారనే ఆశాభావంతో..
Source from HariKrishna
