వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఫ్యాన్స్ సేవాసమితి రాష్ట్రఅధ్యక్షుడు బి.రాముయాదవ్ ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్పయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను స్వయంగా చూస్తూ ప్రతి ఒక్కరికీ నేనున్నా అంటూ భరోసా ఇస్తున్న జగన్ ఆశయసాధనకు తమవంతు కృషిచేస్తామని స్పష్టంచేశారు. ప్రజాసంక్షేమంకోసం జగన్ పడుతున్న కష్టం చూసి అక్కినేని అభిమానులంతా సమావేశమై ఆయనకు మద్దతుతెలపాలనీ, ఆయనతో కలిసి నడవాలని సంకల్పించామని రాముయాదవ్ వివరించారు. ప్రతీ అక్కినేని అభిమాని గడపగడపకు తిరుగుతూ నవరత్న పథకాల గురించి వివరించి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకూ పార్టీకి అండగా ఉంటామని ప్రకటించారు. ఈ ప్రకటన ప్రస్తుతం రాజకీయ, సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. అక్కినేని కుటుంబ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈ ప్రకటన చేయడం వెనుక నాగార్జున ఉన్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే నాగార్జునకు తెలియకుండా ఇటువంటి ప్రకటనలు చేయలేరు కదా.. నిజానికి గడిచిన 2014 ఎన్నికల్లోనే నాగార్జున రాజకీయాల్లోకి రావాలి కానీ పరిస్థితులు అనుకూలించలేదు. 2019 ఎన్నికల నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నారు. కుమారులిద్దరూ సినిమాలు చేస్తుండడంతో నాగార్జున వీలైనంత వరకు సినిమాలు తగ్గించి రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. లాగో జగన్, నాగార్జునలు ప్రాణ స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. గుంటూరు వంటి ప్రాంతంలో నాగార్జునను ఎంపీగా పోటీ చేయించేందుకు ఆపార్టీ కూడా సుముఖత వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో జగన్ ఈ ప్లాన్ ను అమలు చేయడానికి రంగం సిద్దం చేసినట్టు తెలిసింది. నాగార్జున వ్యాపారాలు, అమల చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు రాజకీయంగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా రాము యాదవ్ ప్రకటనతో అక్కినేని పొలిటికల్ ఎంట్రీ వాస్తవరూపం దాల్చనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరోవైపు అక్కినేని వైఎస్ కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఇందుకు దోహదం చేస్తోంది.
