శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి అసంతృప్తితో రగిలిపోతున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి మాజీమంత్రి కోండ్రు మురళీ మోహన్ ను టీడీపీలోకి తీసుకోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు.గత ఏడాది కోండ్రు మురళీమోహన్ ను టీడీపీలోకి తీసుకోవాలని పార్టీ అధిష్టానం భావించింది. అయితే అందుకు ప్రతిభాభారతి అంగీకరించకపోవడంతో కోండ్రు మురళీ మోహన్ కాంగ్రెస్ లోనే ఉన్నారు.అయితే తాజాగా కోండ్రు మురళీమోహన్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న నేపథ్యంలో ఆయనకు రాజాం టికెట్ ఇస్తారని ఆ హామీతోనే కోండ్రు టీడీపీ కండువా కప్పుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.
దీంతో ప్రతిభా భారతి అమరావతిలోని సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు నెలకొన్నాయని చంద్రబాబు దగ్గర పంచాయితీ పెట్టారు. నియోజకవర్గంలో కొందరు గ్రూపులు కట్టి పార్టీలోకి రాకుండానే కోండ్రు మురళీపై ఫిర్యాదు చేశారు.అయితే మురళి కి టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉంటే మాత్రం ప్రతిభా భారతి పార్టీ వీడి వైసీపీకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు మాజీమంత్రి కోండ్రు మురళీమోహన్ ఈనెల 6న సాయంత్రం 6గంటల 15 నిమిషాలకు అమరావతిలో సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో సైకిలెక్కనున్నారు. వాస్తవానికి గత నెల 31న టీడీపీలో చేరాల్సి ఉంది. అయితే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ మరణించడంతో చేరిక వాయిదా పడింది.
