అక్టోబర్ 9 నుంచి 17వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు జరుగనున్నాయి.ఈ నేపథ్యంలో అక్టోబర్ 12 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మాసబ్ట్యాంక్లోని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలో బతుకమ్మ చీరలను కేటీఆర్ పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మొత్తం 95 లక్షల చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఇప్పటికే జిల్లాలకు 49 లక్షల చీరలు పంపిణీ చేశామన్నారు. 80 రకాలైన రంగులలో జరీ అంచు పాలిస్టర్తో చీరలను తయారు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఒక్కో చీర ఖరీదు రూ. 290 కాగా.. చీరల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. చివరి చీరను చివరి మహిళకు ఇచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ చీరలు అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నానని చెప్పారు. చీరల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కేటీఆర్ తెలిపారు.