తెలుగుదేశం పార్టీ తరఫున సత్తుపల్లి నుంచి గెలుపొందిన సండ్ర వెంకటవీరయ్య ఎట్టకేలకు ప్రమాణం చేశారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ టీడీపీ కలవరపాటుకు గురయ్యే కామెంట్లు చేశారు.
టీఆర్ఎస్లో ఎప్పుడు చేరనున్నారనే మీడియా ప్రశ్నకు ఆయన స్పందిస్తూ తాను ఏం చేసినా ప్రజాస్వామికంగానే చేస్తానన్నారు. తాను ప్రజల నుంచి గెలిచి వచ్చానని, పార్టీ మారితే తనను గెలిపించిన ప్రజలకు చెప్పే వెళ్తానని అన్నారు. తాను నియోజక వర్గంలో ఉండి 25 గ్రామ పంచాయితీల సర్పంచ్లను ఏకగ్రీవం చేశానని వివరించారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు ప్రగతి భవన్ వెళితే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. తద్వారా తన ప్రయణం ఏంటనే విషయాన్ని పరోక్షంగా తెలియ జెప్పారు.