నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె నిజామాబాద్ రూరల్ మంచిప్ప గ్రామంలో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన కిశోర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.కిశోర్ మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. కిశోర్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. రాజకీయాల్లో గెలుపుఓటములు,ఒడిదొడుకుల సహజం అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పదవుల కంటే ప్రజల ఆకాంక్షల కోసమే పనిచేసే పార్టీ అన్నారు. పదవి ఉన్నా లేకున్న ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు. నిజామాబాద్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల కోసం పోరాడుతానని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు. ఓటమితో ధైర్యం కొల్పోవద్దని కార్యకర్తలకు సూచించిన కవిత ఓటమిలో కూడా హుందాగా ఉండటం అనేది తెలంగాణ ఉద్యమం నేర్పిందన్నారు. బంగారు తెలంగాణ కోసం అందరం కలిసి పని చేద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.