రాజేంద్రనగర్లోని టీఎస్ఐఆర్డీలో పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ పల్లెసీమలు దేశంలోని ఇతర రాష్ట్రాలు వచ్చి నేర్చుకునే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే ప్రధాన లక్ష్యంతో చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విస్తృత ప్రజాభాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. 30 రోజుల తర్వాత ఖచ్చితంగా గ్రామముఖ చిత్రం మారితీరాలని, దసరా పండుగను ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో జరుపుకోవాలని సీఎం తన ఆకంక్ష వ్యక్తం చేశారు. గ్రామాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే బృహత్తర ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కావాల్సిన అధికారాలు, విధులు, నిధులను ప్రభుత్వం అందించిందని సీఎం అన్నారు. గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు కూడా అధికారాలు, బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం వెల్లడించారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని, నియంత్రిత పద్ధతిలో విస్తృత ప్రజా భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి జరగాలని సీఎం నిర్దేశించారు. పల్లెల ప్రగతికి మంచి మార్గం వేయడానికి అమలు చేసే 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేసే బాధ్యత ప్రజల మీదే ఉందన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై, ఏ ఊరి ప్రజలు ఆ ఊరి కథానాయకులై తమ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని, అవసరమైన చోట ప్రజలే శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు నిబద్ధతతో పని చేసి, తెలంగాణ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతారని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు సీఎం చెప్పారు. పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా చేయడం, నిధుల సద్వినియోగం, ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ది పనులు నిర్వహించడం అనేది నిరంతరం సాగాలని, దీనికోసం ఈ 30 రోజుల ప్రణాళికతో మంచి ఒరవడి ప్రారంభం కావాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని సీఎం అన్నారు. కలెక్టర్లు ఆ నాయకత్వం వహించాలని, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నిబద్ధతతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ బాధ్యతలు పంచుకునేందుకు ముఖ్య శాఖలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని, డిప్యూటీ కలెక్టర్ లేదా మరో హాదా కల్పిస్తామని, వారిలో ఒకరిని పంచాయతీ రాజ్ శాఖకు కేటాయిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ముఖ్య సేవకుడు అనే భావనతోనే తానుంటానని, అధికారులు కూడా అలాగే ప్రజాసేవకులు అనుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయని సీఎం అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 60 లేదా 61 సంవత్సరాలకు పెంచుతామని సీఎం స్పష్టం చేశారు. అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రమోషన్ చార్టు రూపొందించాలని, తమకు ఏ తేదీన ప్రమోషన్ వస్తుందో ఉద్యోగికి ముందే తెలిసి ఉండాలని, పదోన్నతుల కోసం పైరవీలు చేసే దుస్థితి పోవాలని సీఎం అన్నారు. ఉద్యోగులు కూడా పదోన్నతుల విషయంలో వేసుకున్న కేసులను ఉపసంహరించుకోవాలని, అందరికీ పదోన్నతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను కూడా సృష్టిస్తామని వెల్లడించారు. మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లో అధికారులు, ఉద్యుగులను పరుష పదజాలంలో ధూషించడాన్ని ఇకపై ప్రభుత్వం సహించదని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలుపుతూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.
30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లో మంగళవారం జరిగిన రాష్ట్ర సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని, అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషితో పాటు సీనియర్ అధికారులు, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల కలెక్టర్లు, డిపిఓలు, డిఎఫ్ఓలు, సిఇవోలు, డిఎల్పివోలు, ఎంపిడివోలు, ఎంపివోలు, డిస్కమ్ ల సిఎండిలు రఘుమారెడ్డి, గోపాలరావుతో పాటు ఎస్.ఇ.లు ఈ సదస్సులో పాల్గొన్నారు.
‘‘తెలంగాణ ప్రభుత్వం భారీ పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చింది. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాల ఏర్పాటు చేసింది. తండాలు, గూడాలు, శివారు పల్లెలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. గ్రామ పంచాయతీల సంఖ్య 8,690 నుంచి 12,751 కు పెరిగాయి. 3,146 మంది ఎస్టీలు సర్పంచులు అయ్యే అవకాశం కలిగింది. గ్రామీణ పరిపాలనా విభాగాలు పరిపాలనకు, ప్రభుత్వ కారక్రమాలను అమలు చేయడానికి అనువుగా ఉన్నాయి. పరిపాలనా సంస్కరణకు కొనసాగింపుగా ప్రజలకు మంరిత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, విధులు, నిధుల వినియోగంలో సంపూర్ణ స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్ చట్టం తెచ్చింది. ఎస్.కె.డే కృషి వల్ల ఒకనాడు ఉద్యమంగా కొనసాగిన పంచాయతీ రాజ్ వ్యవస్థకు పునర్వైభవం తేవడం, గ్రామ వికాసంలో విస్తృతమైన ప్రజా భాగస్వామ్యం కల్పించడం, గ్రామాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి బాటలు వేయడం, పచ్చని, పరిశుభ్రమైన పల్లె సీమల నిర్మాణం, ప్రణాళికాబద్ధంగా నిధులు వినియోగించడం, అజాగ్రత్త, అలసత్వానికి ఆస్కారం లేని పాలన అందించడం, ప్రజా ప్రతినిథులు, అధికారుల్లో జవాబుదారీతనం పెంచడానికి ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్ చట్టం తెచ్చింది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.
గ్రామ పంచాయతీలు నేల విడిచి సాము చేయవద్దని, గ్రామ పంచాయతీలు ఏకీకృతంగా కాకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో వ్యవస్థీకృతంగా గ్రామాల రూపురేఖలు మార్చాలని సీఎం పిలుపునిచ్చారు.
‘‘గ్రామ స్థాయిలో ప్రభుత్వమే చాలా పనులు నిర్వహిస్తున్నది. మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నది. విద్యుత్ శాఖ ద్వారా నిరంతర విద్యుత్ అందిస్తున్నది. వ్యవసాయ శాఖ ద్వారా రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేస్తున్నది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కావాల్సిన ఆర్థిక ప్రేరణ ప్రభుత్వమే అందిస్తున్నది. పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యపు అన్నం ప్రభుత్వమే పెడుతున్నది. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నది. రేషన్ షాపుల ద్వారానే బియ్యం, ఇతర సరుకులు అందిస్తున్నది. ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి లబ్ధి ప్రభుత్వ యంత్రాంగా ద్వారానే జరుగుతున్నది. రహదారుల నిర్మాణం, వంతెనల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం తదితర పనులన్నీ ప్రభుత్వమే గ్రామ పంచాయతీలపై ఎలాంటి భారం పడకుండానే నిర్వహిస్తున్నది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
‘‘ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలపై కొన్ని నిర్ధిష్ట, ముఖ్యమైన పనులు నిర్వహించే బాధ్యత ఉన్నది. ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని పెంపొందించడం, పచ్చదనం పెంచడం, పరిశుభ్రత కాపాడడం, వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించడం, వాటికి అనుగుణంగా బడ్జెట్ రూపొందించడం, నియంత్రిత పద్ధతిలో నిధుల వినియోగం, క్రమం తప్పకుండా పన్నులు వసూలు చేయడం, విద్యుత్ బిల్లుల లాంటి చెల్లింపులు చేయడం, వీధి లైట్లను సరిగ్గా నిర్వహించడం’’ లాంటి పనులు గ్రామ స్థాయిలో పంచాయతీలు నిర్వహించాల్సిన ముఖ్యమైన విధులు’’ అని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
ప్రజలు తలచుకుంటే, ఉద్యమ స్పూర్తితో పనిచేస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయని, దీనికి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయని సీఎం అన్నారు.
‘‘ఎస్.కె. డే గ్రామీణాభివృద్ది కోసం పంచాయతీ రాజ్ వ్యవస్థకు పురుడు పోశారు. కూసం రాజమౌళి అనే వ్యక్తి కృషి ఫలితంగా వరంగల్ జిల్లా గంగదేవిపల్లి ఆదర్శ గ్రామమైంది. గంగదేవిపల్లిలో 26 గ్రామ కమిటీలున్నాయి.నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం అభివృద్దికి, గ్రామస్తులు, ముఖ్యంగా మహిళల సాధికారితకు సాక్ష్యంగా నిలబడింది. మురార్జీ దేశాయ్ కృషి వల్ల ముంబాయి నగరంలో ట్రాఫిక్ నియంత్రణ సాధ్యమైంది’’ అని ముఖ్యమంత్రి సోదాహరణంగా చెప్పారు.
30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడానికి గ్రామస్థాయిలో ఎవరి బాధ్యత ఏంతటో చెప్పడానికి ముందే ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘ ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్ చట్టం వచ్చింది. పంచాయతీ రాజ్ శాఖలో అన్ని ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నది. ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు వచ్చి నిధులకు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా కలిపి, గ్రామ పంచాయతీలకు నెలకు 339 కోట్ల చొప్పున నిధుల విడుదల చేస్తున్నది. ఒక ఏడాది ఖర్చు చేయగా, మిగిలిన కొన్ని నిధులను వచ్చే ఏడాది బదిలీ చేసేలా చట్టంలో నిబంధన పెట్టింది. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 36 వేల మంది సఫాయి కర్మచారుల జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకుని, వారి వేతనాలను నెలకు రూ.8,500 చెల్లించాలని నిర్ణయించింది. చెత్త సేకరణ కోసం, చెట్లకు నీళ్లు పోయడం కోసం ట్రాక్టర్లు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్పంచులపై కలెక్టర్లు చర్య తీసుకుంటే, స్టే ఇచ్చే అధికారం మంత్రులకు లేకుండా చట్టంలోనే నిబంధనలున్నాయి. సర్పంచులు, అధికారుల అధికారాలు, బాధ్యతలు, విధులను స్పష్టంగా పేర్కొన్నది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
సదస్సులో ప్రసంగం అనంతరం అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు, లేవనెత్తిన సందేహాలకు ముఖ్యమంత్రి సమాధానాలు ఇచ్చారు.
‘‘భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలో మనమెంతో మెరుగ్గా ఉన్నాం. రాష్ట్రం ఏర్పడిన నాడు అధ్వాన్నంగా ఉన్న విద్యుత్ విషయంలో నేడు అగ్రగామిగా ఉన్నాం. ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు, డిస్కమ్ ల సిఎండిలు రఘుమారెడ్డి, గోపాలరావు, విద్యుత్ సిబ్బంది ఎంతో కష్టపడి విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దారు. అదే స్పూర్తితో వారు గ్రామాల్లో ఉండే విద్యుత్ సమస్యలన్నీ పరిష్కరించడానికి ముందుకు వస్తున్నారు’’ అని సీఎం అన్నారు.
30 రోజలు ప్రత్యేక కార్యాచరణపై సదస్సులో విస్తృతంగా చర్చ జరిగింది. 30 రోజుల్లో ఏఏ కార్యక్రమాలు చేపట్టాలనే విషయంలో సదస్సులో తుది నిర్ణయం జరిగింది. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా పారిశుధ్యం కాపాడే విధులు, పచ్చదనం పెంచే విధులు, నిధులు సద్వినియోగం చేసే విధులు, పరిపాలనా విధులు, విద్యుత్ సంబంధ కర్తవ్యాలను సీఎం విడివిడిగా విడమరిచి చెప్పారు.
ముఖ్యమంత్రి ప్రకటించిన కార్యాచరణ ఈ విధంగా ఉంది.
————————————————————-
• సెప్టెంబర్ 6 నుంచి నెలరోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి
• సెప్టెంబర్ 4న కలెక్టర్లు జిల్లా స్థాయి సదస్సు నిర్వహించి, ప్రత్యేక కార్యాచరణ అమలుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి
• ప్రతీ గ్రామానికి ఒక మండల స్థాయి అధికారి పర్యవేక్షకుడిగా నియమించాలి
• జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో మండల పంచాయతీ అధికారి, గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు
• ప్రజలను చైతన్య పరచడానికి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతపై నినాదాలు రాయాలి
• మొదటి రోజు గ్రామ సభ నిర్వహించాలి
• గ్రామ సభలో ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించాలి
• కార్యక్రమ ఉద్దేశ్యాలను గ్రామసభలో ప్రజలకు వివరించాలి
• రెండో రోజు కో ఆప్షన్ సభ్యులను ఎంపిక చేయాలి. స్టాండింగ్ కమిటీలను నియమించాలి
• సర్పంచుల కుటుంబ సభ్యులను కో ఆప్షన్ సభ్యులుగా నియమించవద్దని నిబంధనను ప్రభుత్వం పెట్టింది. కాబట్టి కో ఆప్షన్ సభ్యులుగా, స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో చట్టంలో పొందుపరిచిన నిబంధనలను, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలి
• స్టాండింగ్ కమిటీలలో సగం మంది మహిళలుండాలి
• సర్పంచ్, గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రత్యేకాధికారి, గ్రామ పంచాయతీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు గ్రామంలో పాదయాత్ర నిర్వహించాలి
• ఏఏ పనులు చేయాలో రాసుకోవాలి. దాని ప్రకారం గ్రామ ప్రణాళిక తయారు చేయాలి. గ్రామ ప్రణాళిక రూపకల్పనలో ప్రజల నుంచి సూచనలను ఆహ్వానించాలి. వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేయాలి. ప్రతీ గ్రామ ప్రణాళిక మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారుల వద్ద ఉండాలి
• 30 రోజుల్లో ఒక రోజు పూర్తిగా మహిళలకు కేటాయించాలి. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు గ్రామంలో పచ్చదనం, పారిశుధ్యం కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి’’ అని ముఖ్యమంత్రి వివరించారు
పారిశుధ్య విధులు:
———————–
• గ్రామంలో పారిశుధ్య నిర్వహణ గ్రామ పంచాయతీలపై ఉన్న ప్రధాన భాధ్యత
• కూలిపోయిన ఇండ్లు, పాడుపడిన పశువుల కొట్టాల శిథిలాలు తొలగించాలి
• సర్కారు తుమ్మ, జిల్లేడు, వయ్యారిభామ లాంటి పిచ్చి చెట్లను తొలగించాలి
• పాడు పడిన బావులను, వాడకంలో లేని బోర్లను, లోతట్టు ప్రాంతాల్లోని నీటి గుంతలను పూడ్చివేయాలి
• ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకునేలా, వాటిని ఉపయోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలి
• దోమల మందు పిచికారి చేయాలి
• డ్రైనేజీలను శుభ్రం చేయాలి. మురికి కాలువల్లో ఇరుక్కుపోయిన చెత్తచెదారం తొలగించాలి
• రోడ్లపై గుంతలను పూడ్చాలి
• పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్య పనులు గ్రామ పంచాయతీ చేయాలి
• సంతలు, మార్కెట్ ప్రదేశాలను శుభ్రపరచాలి
• ప్రతీ ఇంట్లో చెత్త బుట్ట ఉండేలా ప్రజలను ప్రోత్సహించాలి
• చెత్తను ఎత్తి, డంపింగ్ యార్డులో వేసి, ఆ చెత్తను కంపోస్టు ఎరువుగా వినియోగించేలా బాధ్యత తీసుకోవాలి
• అవకాశం ఉన్న చోట బందెలదొడ్డి ఏర్పాటు చేయాలి
• సఫాయి కర్మచారులకు జీతాలు పెంచినందున, వారిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి
• ఎవరైనా రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 జరిమానా విధించే నిబంధన కూడా చట్టంలో ఉంది. దీన్ని గ్రామ పంచాయతీలు వినియోగించుకుని, ప్రజల్లో చైతన్యం కలిగించి, గ్రామాలను అద్దంలా తీర్చిదిద్దాలి
• దహన వాటికలు – ఖనన వాటికలు (వైకుంఠ ధామం), డంపింగ్ యార్డులకు కావాల్సిన స్థలం ఎంపిక చేయాలి
• ప్రభుత్వ స్థలం లేకుంటే గ్రామ పంచాయతీ నిధులతో స్థలం కొనుగోలు చేయాలి. దాతల విరాళాల ద్వారా కూడా స్థలం కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాలి
పచ్చదనం పెంచే విధులు
—————————-
• ఇంటి దగ్గర నాటడానికి అవసరమైన మొక్కల ఇండెంట్ ను గ్రామపంచాయతీ సేకరించాలి. ప్రతీ ఇంటికి వేప మొక్కతో పాటు మొత్తం ఆరు మొక్కలు పంపిణీ చేయాలి
• వ్యవసాయ భూములు, వ్యవసాయ బావుల వద్ద పెంచడానికి అనువైన మొక్కలను రైతులకు అందివ్వాలి. మండల వ్యవసాయాధికారి సహకారంతో రైతుల నుంచి ఇండెంట్లు తీసుకోవాలి. చింత, అల్లనేరేడు, ఇతర మొక్కలు పంపిణీ చేయాలి
• ఇండెంట్ కన్నా ఎక్కువ మొక్కలను అందుబాటులో ఉంచుకోవాలి. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలి
• గ్రామ విస్తీర్ణానికి అనుగుణంగా, శాస్త్రీయంగా అంచనా వేసి అవసరమైన మొక్కలను సిద్ధం చేయడానికి గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే నర్సరీలు ఏర్పాటు చేయాలి. శాశ్వత ప్రాతిపదికన నర్సరీలు నిర్వహించడానికి అనువైన స్థలం ఎంపిక చేయాలి
• నర్సరీలను పెంచడానికి ఫారెస్ట్ రేంజ్ అధికారి గ్రామ పంచాయతీలకు సాంకేతిక సహకారం అందించాలి
• గ్రామపంచాయతీ లోపల నాటడానికి అందుబాటులో ఉన్న భూములను మరియు పంచాయతీ సరిహద్దుల్లో ఉన్న భూములు మరియు రహదారులను కూడా గ్రామపంచాయతీ గుర్తించాలి
• ఊరు బయట అడవులు, కంచెలు, గుట్టలు, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా పండ్ల మొక్కలు పెంచడం ద్వారా కోతుల బెడదను తీర్చవచ్చు
• గ్రామ గ్రీన్ ప్లాన్(హరిత ప్రణాళిక)ను సిద్ధం చేయాలి. అన్ని గ్రామల గ్రీన్ ప్లాన్ కు అనుగుణంగా జిల్లా గ్రీన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా గ్రీన్ ప్లాన్ తయారు చేయాలి
• గ్రామ పంచాయతీ మొక్కల రక్షణ ఏర్పాట్లు చేయాలి
• గ్రామ బడ్జెట్లో 10 శాతం నిధులు పచ్చదనం పెంచడానికి వినియోగించాలి
• ప్రతీ గ్రామ పంచాయతీ విధిగా ట్రాక్టర్ సమకూర్చుకోవాలి
• చెత్త సేకరణకు, చెట్లకు నీళ్లు పోయడానికి ట్రాక్టర్ వినియోగించాలి
• నాటిన మొక్కల్లో 85 శాతం చెట్లనన్నా రక్షించకుంటే, గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శిపై చర్యలుంటాయి
పవర్ వీక్ – విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారం
————————————————————
• గ్రామంలో పవర్ వీక్ నిర్వహించాలి. విద్యుత్ శాఖ సిబ్బంది గ్రామంలోనే ఉండి సహకరిస్తారు
• వేలాడుతున్న మరియు వదులుగా ఉండే కరెంటు వైర్లు మరియు విద్యుత్ స్తంభాలను సరిచేయాలి
• వంగిన స్తంభాలను సరిచేయాలి. తుప్పు పట్టిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలి
• ఎల్ఇడి లైట్లను అమర్చాలి
• వీధి దీపాల సమర్థ నిర్వహణకు థర్డ్ వైర్, సపరేట్ మీటర్, స్విచ్చులు బిగించాలి
• పగలు వీధి లైట్లు వెలగకుండా చూడాలి. శీతాకాలంలో సాయంత్రం 6.00 నుండి ఉదయం 6.30 వరకు, ఇతర సమయాల్లో సాయంత్రం 7.00 నుండి ఉదయం 5.30 వరకు వీధి లైట్లు వేయాలి
ఆర్థిక పరమైన విధులు
—————————
• వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందించాలి. వాటికి గ్రామసభ ఆమోదం తీసుకోవాలి
• ఈ ప్రణాళికలకు అనుగుణంగానే బడ్జెట్ రూపొందించాలి
• అప్పుల చెల్లింపు, జీతాల చెల్లింపు, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర ఖర్చులను తప్పనిసరిగా చేయాల్సిన వ్యయం (చార్జుడ్ అకౌంటు)లో చేర్చాలి
• ప్రతీ ఇంటికీ, ప్రతీ ఆస్తికి సరైన విలువ కట్టాలి. క్రమం తప్పకుండా ఆస్తుల విలువ మదింపు చేయాలి
• పన్నులు క్రమం తప్పకుండా వసూలు చేయాలి. పన్నులు వందశాతం వసూలు చేయని గ్రామ కార్యదర్శిపై చర్యలుంటాయి
• మొక్కలు నాటడం, స్మశాన వాటిక నిర్మాణం, డంపు యార్డు నిర్మాణ తదితర పనులకు నరేగా నిధులు వినియోగించాలి
నిధుల సమీకరణ మార్గాలు
——————————–
• రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు వస్తాయి
• ఫైనాన్స్ కమిషన్ నిధులు సమకూరుతాయి
• నరేగా నిధులు వస్తాయి
• గ్రామ పంచాయతి సాధారణ నిధులు అందుబాటులో ఉంటాయి
• ప్రజల శ్రమదానంతో పనులు నిర్వహించాలి
• సి.ఎస్.ఆర్. నిధులను సమకూర్చుకోవాలి
• దాతల నుంచి విరాళాలు సేకరించాలి
రాష్ట్ర వ్యాప్తంగా 100 ఫ్లయింగ్ స్క్వాడ్ లు
———————————————–
• సీనియర్ అధికారుల నేతృత్వంలో 100 ఫ్లయింగ్ స్వ్కాడ్ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది
• 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు తర్వాత ఈ బృందాలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాయి
• లక్ష్యాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు అందుతాయి
• అజాగ్రత్త, అలసత్వం ప్రదర్శించిన వారిపై చర్యలుంటాయి