జిహెచ్ఎంసి పరిధిలోని నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అందులో భాగంగా మొదట అంబర్ పేట నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని మంత్రులు కెటి రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు నిర్వహించారు. అసెంబ్లీలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో జిహెచ్ఎంసి, జలమండలి, నేషనల్ హైవే, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాల పురోగతిని ఈ సమావేశంలో చర్చించారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, అంబర్ పేట ప్లై ఒవర్ పనులు, డబుల్ బెడ్ రూం నిర్మాణాలకున్న అవకాశాలపైన వివరాలను అధికారులు అందించారు. అంబర్ పేట ఫ్లైఒవర్ పనుల ప్రారంభానికి అవసరం అయిన భూసేకరణ దాదాపుగా పూర్తి అయిందని టౌన్ ప్లానింగ్ అధికారులు మంత్రులకు తెలియజేశారు. రానున్న మూడు వారాల్లో భూసేకరణ పూర్తయిన ప్రాంతాన్ని నేషనల్ హైవే అధికారులకు అప్పజేప్పుతామని జిహెచ్ఎంసి అధికారులు తెలిపారు. నియోజక వర్గ పరిధిలో సరిపడేంతా తాగునీటి సరఫరా జరుగుతున్నదని జల మండలి అధికారులు తెలిపారు. ప్రతి రోజు దాదాపు 11 యంజిడిల నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఇంకా ఎక్కడైనా సమస్యలున్న ప్రాంతాలుంటే వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రులు జలమండలి అధికారులకు అదేశాలు జారీ చేశారు. మూసీలో కలుస్తున్న మురికినీటి నాలాల క్లీనింగ్ జరుగుతున్న తీరుపైన, అంబర్ పేట ట్రీట్ మెంట్ ప్లాంట్ పైనా జలమండలి అధికారులతో చర్చించారు.
అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వేంకటేష్ పలు సమస్యలను ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పారిశుద్ధ్యం ప్రస్తుతం బాగా జరుగుతున్నదని, మరికొంత మంది సిబ్బందిని అదనంగా కేటాయించాలని కోరారు. దీంతోపాటు అంబర్ పేటలో డబుల్ బెడ్ రూంల నిర్మాణాలకు అవకాశం ఉన్న పలు ప్రాంతాలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఈ ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణానికి ఉన్న పరిస్ధితులపైన వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్ధానిక ఎమ్మార్వో ని మంత్రులు అదేశించారు. ఖాళీ ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తే వెంటనే ఇళ్ల నిర్మాణానికి అనుమతులను మంజూరీ చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహాన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జిహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కూమార్, జలమండలి ఎండి దానకిశోర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.