ఇచ్చిన ప్రతీ హామీ, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ముందడుగు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్.జగన్ అన్నారు. 208వ ఎస్ఎల్బీసీ సమావేశంలో పాల్గొన్న సీఎం విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుందని, ప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం వివిధ పథకాలకింద అనేకమందికి నగదు ఇస్తుందని ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలన్నారు.
రైతులకు, డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందన్నారు. ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో బ్యాంకర్లతో జగన్ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న, త్వరలో చేయబోయే పథకాలకు తోడ్పాటునందించాలని కోరారు. మా ఆర్థికశాఖతో టచ్లో ఉండండి.. వడ్డీలేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిస్తామన్నారు.