‘ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ -2019 ‘ అవార్డు ప్రదానం కార్యక్రమం మంగళవారం న్యూఢిల్లీలో జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర వాణిజ్య, ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేంద్ర పారిశుధ్య శాఖ కార్యదర్శి పరమేశ్వర్ అయ్యర్, తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.రఘునందన్ రావు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరంతరం చేస్తున్న కృషితో రాష్ట్రంలో పారిశుద్ధ్య పరిస్థితులు ఎంతో మెరుగయ్యాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
‘సీఎం కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యంగా సర్పంచ్ చొరవతోనే ఈ ఘనత సాధ్యమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన పల్లె ప్రగతి(30 రోజుల ప్రత్యేక ప్రణాళిక)తోనే ఇది సాధ్యమైంది. పల్లె ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు ఎంతో మెరుగయ్యాయి. సాధారణ పరిసరాలతోపాటు స్కూళ్లు, అంగన్వాడీలు, పీహెచ్ సిలు, సంతలు… ఇలా అన్ని పబ్లిక్ ప్లేస్ లతోపాటు గ్రామాల్లోని ప్రతి ఇంటి ఆవరణలో పరిశుభ్రత పెరిగింది. పారిశుధ్య నిర్వహణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు నిర్మాణాన్ని నిర్మించే దిశగా పనులు చేపట్టింది’ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.