వచ్చే నెల 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే యాసంగి (రబీ) సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఏర్పట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. 2019-20 యాసంగి కార్యాచరణపై సోమవారం నాడు హాకా భవన్లో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల్ రాజేందర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి మరియు కమిషనర్ పి. సత్యనారాయణ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయ్, మార్క్ ఫెడ్ ఎండి భాస్కరాచారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు, గన్నీ సంచులు, స్టోరేజ్ స్పేస్, రవాణా తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర రావు గారు చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, ముఖ్యంగా కాళేశ్వరం నీటి రాకతో ప్రతి ఎకరా సాగులోకి వస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోందని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు.వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఈ రబీలో 77.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. పెరిగిన అంచనాలకు అనుగుణంగా కొనుగోళ్లకు పకడ్బందీగా ఏర్పట్లు చేయాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు.