లాక్డౌన్ పుణ్యమా అని యువకులు రోడ్ల మీదికొచ్చి ‘ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా’ అంటూ నెచ్చెలి కోసం వెతికే పరిస్థితి లేదు. ‘ఇతడే.. నే కలగన్న నా వరుడు’ అంటూ యువతులు మనసుపారేసుకునే అవకాశం లేదు. అందుకే ప్రేమ కోసం ‘ఆన్లైన్’ బాట పట్టారు. లాక్డౌన్తో కలిగిన ఒంటరితనాన్ని డిజిటల్ ప్రేమతో చెరిపివేసేందుకు తాపత్రయపడుతున్నారు. ఇదే అదునుగా డేటింగ్ యాప్లు సైతం కొత్త కొత్త ఫీచర్లతో ముందుకొస్తున్నాయి. ఫలితంగా రెండు నెలలుగా ప్రపంచవ్యాప్తంగా డేటింగ్ యాప్ల పంట పండుతున్నది.
వర్చువల్ మీటింగ్స్
ఫ్లోష్, సిర్ఫ్ కాఫీ, మైస్కూట్ వంటి స్టార్టప్ సంస్థలు కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నాయి. చాటింగ్లకే పరిమితం కాకుండా జూమ్ యాప్తో జతకట్టి ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి.
ఫీజు చెల్లించిన వినియోగదారులు ఇంట్లో కాఫీ కప్పు చేతిలో పట్టుకొని జూమ్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనవచ్చు. అంటే చాయ్ దుకాణంలో మీటింగ్ వంటిదన్నమాట. లాక్డౌన్లో కొత్త వినియోగదారుల సంఖ్య 20% పెరిగిందని ఆయా సంస్థలు చెప్తున్నాయి. ఇందులో బ్యాంకర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు వంటివారే ఎక్కువగా ఉన్నారని తెలిపాయి.