ఆధిపత్యానికి, అణచివేతకు మధ్య అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య అహంభావానికి, తెలంగాణపై ప్రేమకు మధ్య అబద్ధానికి, నిజానికి మధ్య పోరాటానికి ముహూర్తం సమీపించింది.
దెబ్బతగలని చేతికి దొంగకట్టు కట్టుకొని గోబెల్స్ని మించి మైకులను ఊదరగొట్టిన నేత ఒకరు. దశాబ్దాల తరబడి ప్రజలతో మమేకమై.. తామేం చేశామో.. ఏం చేయబోతున్నామో చెప్తూ నియతి తప్పకుండా ముందుకు సాగిన నాయకుడు ఇంకొకరు. బీజేపీ నేతల ఇండ్లల్లో డబ్బులు పట్టుబడితే పోలీసులపైనే ఉల్టా దాడిచేసి.. డబ్బులు ఎత్తుకుపోయి, నిరాహార దీక్షకు దిగి 24 గంటల్లోనే విరమించుకొన్న నాయకుడు ఇంకొకరు. ప్రజలకోసం.. ప్రజల మధ్య రేయింబవళ్లు తిరుగుతూ.. వారి ఆదరాభిమానాలు పొందింది మరొకరు. అడ్డగోలుగా డబ్బులు పంచుతూ.. అడ్డదిడ్డంగా అబద్ధాలాడుతూ.. నోటికొచ్చినట్టుగా మాట్లాడిన బీజేపీ నేతలు రోజుకోరీతిన రాజకీయ నాటకాన్ని రక్తి కట్టించారు. ఈ నాటకాలెలా ఉన్నా.. గులాబీ గుభాళించడం ఖాయమని, టీఆర్ఎస్ ధూంధాం తథ్యమని చివరి రోజు సైతం దుబ్బాక ప్రజలు చాటి చెప్పారు. సత్యాసత్యాల మధ్య సమరంలో దుబ్బాక ఓటరు తన తీర్పును నిక్షిప్తం చేసేది రేపే.
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు 6న మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.
మంగళవారం పోలింగ్ జరగనున్నది. ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ‘నోటా’తో కలుపుకొని మొత్తం 24 గుర్తులుంటాయి. రేపు పోలింగ్ నిర్వహించి, ఈ నెల 10న సిద్దిపేట ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ చేపడుతారు.
ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పోలీసులు పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతోపాటు ఈ ఎన్నికల బందోబస్తు విధుల్లో నాలుగు కంపెనీల సాయుధ బలగాలను రంగంలోకి దించినట్టు శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ నేతృత్వంలో నలుగురు అదనపు ఎస్పీలు, పది మంది డీఎస్పీలు, సీఐలు 22 మంది, ఎస్సై లు 45 మందితోపాటు 2వేల మంది వరకు పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 89 సమస్యాత్మక, 33 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించిన పోలీసులు వాటి వద్ద మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.