Home / BHAKTHI / శివరాత్రి రోజు జాగరణ ఎందుకు…?

శివరాత్రి రోజు జాగరణ ఎందుకు…?

హిందువులు, ముఖ్యంగా శివ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ మహా శివరాత్రి. ఆ మహా శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కూడా మహా శివరాత్రి అని పురాణాలు చెబుతున్నాయి. మహా శివరాత్రికి ఎన్నో ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. పురాణాల ప్రకారం..

శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహా శివరాత్రి అని చెబుతుంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం, మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. మహా శివరాత్రి రోజు శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుని, పూలు, ఫలాలతో శివలింగాన్ని పూజిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందనేది శివ భక్తుల బలమైన విశ్వాసం.


శివుడు.. భోళా శంకరుడు. పత్రం పుష్పం ఫలం తోయం…వీటిలో ఏది సమర్పించినా స్వీకరిస్తాడు. భక్తి శ్రద్ధలతో తనను కొలిచే భక్తులను ఆనందంగా అనుగ్రహిస్తాడు…జన్మానికో శివరాత్రి అంటారు గానీ, మహాశివరాత్రి పర్వదినం ఏటేటా వస్తూనే ఉంటుంది. మనలో నిద్రాణమైన భక్తిని జాగృతం చేస్తూనే ఉంటుంది.

అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి. ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు. జాగారం ఎందుకు చేస్తారు. జాగారం ఎవరు, ఎప్పుడు ప్రారంభించారు. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు.

లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి, నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు.

అయినా, శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి, జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ, జప ధ్యానాలు చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది.

 

క్రీస్తుపూర్వం 3వేల ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు. క్రీస్తుపూర్వం 1500-1200 నాటికి చెందిన రుగ్వేద శ్లోకాలలో రుద్రుడి పేరిట శివుని ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవమత సిద్ధాంతాల ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఉపనిషత్తు భగవద్గీత కంటే మునుపటిది. అయితే, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శైవారాధన పద్ధతులు, సంప్రదాయాలు మాత్రం క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తుశకం 100 సంవత్సరాల మధ్య ప్రారంభమై ఉంటాయని గావిన్‌ ఫ్లడ్‌ వంటి చరిత్రకారుల అంచనా.

శివారాధనలో మూర్తి రూపం, లింగరూపంలోనూ పూజిస్తారు. లింగ రూపమే ప్రధానమైనది. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని 12 శివుని ప్రసిద్ద ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat