తెలంగాణలో ఇటీవలి కాలంలో మరణించిన ఎమ్మెల్యేలకు శాసనసభ నివాళులర్పించింది. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కమతం రాంరెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావు, మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య, చెన్నూరు మాజీ సభ్యులు దుగ్యాల శ్రీనివాస్ రావు, జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్న, అమరచింత మాజీ ఎమ్మెల్యే కే వీరారెడ్డికి సభ నివాళులర్పించింది. వీరందరి ఆత్మలకు శాంతి చేకూరాలని సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
శాసనసభ ప్రారంభమైన వెంటనే నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానాన్ని మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, రవీంద్ర నాయక్, జైపాల్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ బలపరిచారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ బలపరిచి నోముల నర్సింహయ్య మృతికి సంతాపం తెలిపారు.
నోముల ఆత్మీయతను ఎప్పటికీ మరువలేను : సీఎం కేసీఆర్
హైదరాబాద్ : నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆత్మీయతను ఎప్పటికీ మరువలేను.. ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో నోముల నర్సింహయ్య మృతి పట్ల సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెడుతానని అనుకోలేదు. నోముల నర్సింహయ్య వ్యక్తిగతంగా తనకు దగ్గరి మిత్రులు. చాలా సంవత్సరాలు ఆయనతో కలిసి పని చేశాం. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. నర్సింహయ్య గురువు రాఘవరెడ్డిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి నర్సింహయ్య బాధపడేవారు. ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కరోనా వచ్చి కూడా పోయింది. హఠాత్తుగా మరణించడం దురదృష్టకరమన్నారు.
ఉద్యమశీలి, ప్రజా నాయకుడు స్వర్గీయ నోముల నర్సింహయ్య.. బడుగు బలహీన వర్గాల వారికి తన జీవితాన్ని అంకితం చేశాడు. నోముల నిరంతరం ప్రజా సేవలో గడిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పాలెం గ్రామంలో పేద యాదవకుటుంబంలో జన్మించిన నోముల.. ఓయూలో ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాలకు నాయకత్వం వహించారు. పేద ప్రజల పక్షం వహించి ప్రజా న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. తన ఆశయాలకు అనుగుణంగా సీపీఎం పార్టీలో చేరారు. మండల పరిషత్ అధ్యక్షునిగా ప్రారంభమైన నోముల ప్రస్థానం ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. ఆయన ప్రసంగాలు ఎందరినో ఆకర్షించేవి. ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో ఆయన దిట్ట. ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల హక్కుల కోసం నర్సింహయ్య నిరంతరం పోరాడారు. నకిరేకల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలుపొందారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు పట్ల సీపీఎం పార్టీ వైఖరికి నిరసనగా ఆ పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 64 ఏండ్ల వయసులో గత డిసెంబర్లో గుండెపోటుతో మరణించడం తెలంగాణ ప్రజలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఆయన ఆత్మీయతను ఎప్పటికీ మరువలేను. నర్సింహయ్య ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అని సీఎం అన్నారు.