ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి కొత్త జిల్లాల్లో పాలన అమల్లోకి వచ్చింది. పలుచోట్ల ప్రజల అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడంతో పాటు అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే ఒకట్రెండు చోట్ల ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త జిల్లా ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడున్న 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా ఏర్పాటయ్యే అవకాశముందని చెప్పారు. గిరిజన ప్రాంతాలన్నీ ఒకే జిల్లా పరిధిలో ఉండాలనేది సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. పాలనను మరింత సులభతరం చేసేందుకు మరో కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశముందని తెలిపారు.
ఇప్పటికే మార్కాపురం, రంపచోడవరం తదితర ప్రాంతాలను జిల్లాగా చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. పేర్ని నాని గిరిజన ప్రాంతాల ప్రస్తావన తెచ్చినందున రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటవుతుందనే ఊహాగానాలు జోరుగా జరుగుతున్నాయి. రంపచోడవరంతో పాటు పోలవరం ముంపు మండలాలను కలిపి రంపచోడవరం జిల్లాగా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.