మనదేశంలోకి కొవిడ్ కొత్త వేరియంట్ వచ్చిందన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ పంపిణీని మరింత ఎక్కువగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రికాషన్ డోసు ఇవ్వనుంది. ఏప్రిల్ 10 ఈ ప్రికాషన్ డోసు పంపిణీ ప్రారంభం కానుంది. అయితే ప్రైవేట్ కేంద్రాల్లోనే దీన్ని పంపిణీ చేయనున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకుని 9నెలల పూర్తయిన వారందరికీ ఈ ప్రికాషన్ డోసు ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో తొలి రెండు డోసుల వ్యాక్సినేషన్ కొనసాగుతున్నందున ప్రికాషన్ డోసును ప్రైవేట్ కేంద్రాల్లో ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. మరో విషయం.. తొలి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ను తీసుకుంటే ప్రికాషన్ డోసు కూడా అదే ఉండేలా చూసుకోవాలి.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రికాషన్ డోసు నిర్ణయంపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. బూస్టర్ డోసు తీసుకోని వారిని చాలా దేశాలు అనుమతించండం లేదని.. ఈ పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. బూస్టర్ డోసు వినియోగించుకునేందుకు కొవిడ్షీల్డ్కు అనుమతి లభిస్తే రూ.600కే దాన్ని పంపిణీ చేస్తామని అదర్ పూనావాలా చెప్పారు.