ప్రముఖ నటుడు చిరంజీవిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను చేసిన కామెంట్స్ చిరంజీవి అభిమానులు, కాపు మహానాడు నేతల్లో కొందరికి ఆవేశం, కొందరికి బాధ కలిగాయని.. వారి బాధను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్మీట్లో నారాయణ మాట్లాడారు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.. అవి లేకుండా రాజకీయాలు ఉండవన్నారు. రాజకీయ భాషను మించి చిరంజీవి గురించి మాట్లాడిన దాన్ని భాషా దోషంగా భావించాలని కోరారు. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలన్నారు. భీమవరంలో ఇటీవల జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించడంపై నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. సూపర్స్టార్ కృష్ణను ఆహ్వానించకుండా చిరంజీవిని పిలిచారనే క్రమంలో తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో నారాయణ మళ్లీ స్పందించారు.