PAWAN KALYAN: జనసేనాని ప్రచార రథం వారాహి రేపు మంగళవారం రోడ్డెక్కనుంది. కొండగట్టు అంజన్న సన్నిధానంలో ప్రత్యేక పూజల తర్వాత మొదటి పరుగు ప్రారంభించనుంది.
తన ఆరాధ్య దైవం ఆంజనేయస్వామికి పూజలు చేసి జనసేన అధినేత… సార్వత్రిక సమరాన్ని ప్రారంభించనున్నారు. రేపు ఉదయం వారాహి పూజ.. అనంతరం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేయనున్నారు. అనంతరం తెలంగాణ జనసేన నేతలతో సమర సన్నాహాలపై చర్చించనున్నారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైన నేపథ్యంలో ఈ సారి అభ్యర్థుల్ని బరిలోకి దించే దిశగా పవన్ కల్యాణ్ అడుగులు పడుతున్నట్లు సమాచారం.
పవన్ కల్యాణ్ వారాహి వాహనంతోపాటు రేపు హైదరాబాద్ నుంచి ఉదయం 7 గంటలకు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరుతారు. అక్కడ ఉదయం 11 కు పవన్ చేరుకుని వారాహికి ప్రత్యేక పూజలు జరిపించనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశంలో పవన్ పాల్గొంటారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు.
అనంతరం కొడిమ్యాల మండలం నాచుపల్లిలో ముఖ్యనేతలతో భేటీకానున్నారు. సాయంత్రం 4 గంటలకు ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహాస్వామికి ప్రత్యేక పూజలు చేసి శ్రీకారం చుట్టనున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాత్ర అనంతరం పవన్….తిరిగి సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.