తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ షురూ అయింది…కర్నాటక ఎన్నికల్లో గెలుపు తర్వాత తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని టీ కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారు.అసలే కాంగ్రెస్ లో ఉన్న నాయకుల్లో అందరూ సీఎం అభ్యర్థులే..ఆలు లేదు చూలు లేదన్నట్లుగా అప్పుడే మేం సీఎం అవుతామంటే మేం సీఎం అవుతామంటూ దాదాపు 40 మంది నాయకుల వరకు సీఎం కుర్చీ కోసం తెగ స్కెచ్ లు వేస్తున్నారు. మరోవైపు దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సీఎం కుర్చీపై కన్నేశారు. ఈ క్రమంలో పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ వంటి మాజీ ఎంపీలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకుగాను టికెట్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దల దగ్గర పైరవీలు మొదలెట్టారు. కాగా గతంలో నిజామాబాద్ ఎంపీగా పని చేసిన మధుయాష్కీ ఇప్పుడు ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే మధుయాష్కీ రాకతో ఎల్బీనగర్ కాంగ్రెస్ లో మరో కొత్త రచ్చ మొదలైంది. ఇదే స్థానం నుంచి స్థానిక నేతలైన మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సోదరుడు, మరో నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి సైతం అభ్యర్థిత్వం కోసం అప్లయ్ చేసుకున్నారు. మధుయాష్కీ రాకపై స్థానిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్ లో నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్లో వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.
పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. సేవ్ ఎల్బీనగర్, సేవ్ కాంగ్రెస్, మధు యాష్కి గో బ్యాక్ టు నిజామాబాద్ అంటూ పోస్టర్లు వెలిశాయి. 2009 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించిన మధుయాష్కి.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓటమి చవిచూశారు. దీంతో ఆయన ఈసారి పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి కాకుండా.. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్కడ స్థానిక నేతలైన మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సోదరుడు, మరో నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి సైతం టికెట్ కోసం పోటీపడుతుండడంతో పోటీ త్రిముఖంగా మారింది. ఈ నేపథ్యంలో కష్టకాలంలో కూడా నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వస్తున్న తమకు కాకుండా బయటనుంచి వచ్చిన మధుయాష్కీకి కి టికెట్ ఇస్తారేమోనని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో యాష్కికి వ్యతిరేకంగా గాంధీ భవన్లో పోస్టర్లు అతికించి తమ నిరసన తెలిపారు. కాగా పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దు అంటూ గాంధీభవన్ లో వెలిసిన పోస్టర్లపై మధుయాష్కీ వర్గం మండిపడుతోంది. మొత్తంగా పారాచూట్ నాయకులకు టికెట్లు ఇవ్వొద్దు అంటూ ఏకంగా కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలవడం గాంధీభవన్ లో కలకలం రేపుతోంది.