వచ్చే ఉగాది నాటికి మిషన్ భగీరథ పనులు పూర్తిచేసి ఇంటింటికీ నల్లనీరు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామపంచాయతీ శివారు రాకాశితండ వద్ద ఆకేరుపై రూ.16కోట్ల వ్యయంతో నిర్మించనున్న చెక్డ్యాం కం బ్రిడ్జీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు జరిగి మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పడినప్పుడే వెనకబడిన గ్రామాలు సైతం అభివృద్ధి చెందుతాయన్నారు. ముఖ్యంగా జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలను కలిపే లింకు రోడ్లను పూర్తిచేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 16 తేదీన శ్రీభక్తరామదాసు ఎత్తిపోతల పథకం రెండో దశను ప్రారంభించి 13వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని వివరించారు.
