ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభావంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన తెలంగాణలో భాషా వికాసంపై జరిగిన సదస్సుకు సినీ నటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణి విశిష్ట అతిథిగా హాజరయ్యారు.ఈ క్రమంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ వేదికపై తన ఆదిగురువుకు సాష్టాంగ ప్రణామం చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంస్కారానికి తనికెళ్ల భరణి చేతులెత్తి మొక్కారు. ఇలాంటి పాలకుడు ఏలిక అయితే ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారనిపించిందని అన్నారు. ఆ సంఘటనను చూడగానే అలవోకగా తాను రాసిన కవితను తనికెళ్ల భరణి చదివి వినిపించారు.
సరస్వతికి సంస్కారం మొక్కినట్టు ఉన్నది
బంగారు తెలంగాణ మెట్లు ఎక్కినట్టు ఉన్నది
మనలోపటి అహమంతా కాలినట్టు ఉన్నది
కలువకుంటలో చంద్రుడు తేలినట్టు ఉన్నది అని వివరించారు.
భవిష్యత్తు తరాలకు ఇది ఆదర్శంగా నిలుస్తుందని తనికెళ్ల భరణి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావులో సాహిత్యపు రుచి ఉండటం వల్లనే ఇంత భారీగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయని అన్నారు.ఆ తర్వాత తెలంగాణ గడ్డపై రాసిన సుధీర్ఘ కవిత, శివుడిపై రాసిన గేయం పాడి వినిపించారు.