తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ” కాకతీయ మెగాటెక్స్టైల్ పార్కు ” నకు సంగెం, గీసుగొండ మండలాల సరిహద్దులో సీఎం కేసీఆర్ ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ స్థాయిలోనే అతిపెద్ద వస్త్రఉత్పత్తుల కేంద్రంగా గుర్తింపు పొందనున్న ఈ టెక్స్టైల్ పార్కు వరంగల్రూరల్ జిల్లాలో సుమారు 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతోంది. సంగెం మండలం చింతలపల్లి సరిహద్దులో ఏర్పాటు చేస్తున్న టెక్స్టైల్ పార్కుతోపాటు వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట ఆర్వోబీ, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లకూ టెక్స్టైల్ పార్కు వద్దనే సాయంత్రం 4గంటలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కాగా టెక్స్టైల్ పరిశ్రమకు పునాదిరాయి పడిన రోజే 12 కంపెనీలు సీఎం సమక్షంలోనే ఎంవోయూలు కుదుర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చైనా, బంగ్లాదేశ్, దక్షిణ కొరియాల్లో మాదిరిగా వస్త్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని రంగాలను ఒకే చోట ఏర్పాటు చేస్తున్నారు. వస్త్ర పరిశ్రమ కోసం భూసేకరణకు సంబంధించి ఇప్పటికే సంగెం, గీసుగొండ మండలాలకు చెందిన 731 మంది పట్టాదార్లు స్వచ్ఛందంగా భూమిని అప్పగించారు. మొత్తం 1190 ఎకరాలను రూ.87.78 కోట్ల వ్యయంతో సేకరించగా, ఇందులో 170.5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కూడా పార్కుకు బదలాయించారు. టెక్స్టైల్ పార్కులో వస్ర్తాలు, లుంగీలు, దుప్పట్ల తయారీతోపాటు స్పిన్నింగ్, జిన్నింగ్ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. మొత్తం ఐదు దశల్లో స్పిన్నింగ్, టెక్స్టైల్, వీవింగ్, నిట్టింగ్, ప్రాసెసింగ్, ఊవెన్, ఫ్యాబ్రిక్, యార్న్ డైయింగ్, టవల్ షీటింగ్, ప్రింటింగ్ , రెడీమేడ్ యూనిట్లను నెలకొల్పనున్నారు. మొత్తం 172 యూనిట్ల స్థాపనకు టీఎ్సఐఐసీ అంచనాలు రూపొందించింది. కాగా వరంగల్ వస్త్ర పరిశ్రమ ద్వారా లక్షన్నర మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తొలి విడతలో 12 కంపెనీలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాగా.. వాటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి కలగనుంది.
భారీ సన్నాహాలు..
మెగా టెక్స్టైల్స్ పార్కు శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీఎ్సఐఐసీ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం భారీ ఎత్తున సన్నాహాలు చేసింది. టెక్స్టైల్స్ పార్కు శంకుస్థాపన అనంతరం శాయంపేట ప్రాంతంలో ఏర్పాటు చేసే బహిరంగసభకు 2లక్షలకు పైగా జనాన్ని సమీకరించేందుకు వివిధ స్థాయిల్లో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పర్యవేక్షణలో శంకుస్థాపన ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు, టీఎ్సఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు స్థానిక పార్టీ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి బహిరంగసభ కోసం సమాయత్తం చేశారు. అవసరమైన రవాణా, వసతి సౌకర్యాలు సిద్దం చేశారు.
భారీ స్థాయిలో పెట్టుబడులు..
మొదటి దశలో ఏర్పాటుచేసే కంపెనీలు రెండేళ్లలో అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఐదేళ్లలో 1000 పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా జిల్లాకు రూ.11 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు అభివృద్ధితో వివిధ రకాల వస్త్ర ఉత్పత్తి, అనుబంధ పరిశ్రమలను స్థాపించేందుకు దేశ విదేశీ ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే తిరువూర్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10 యూనిట్ల ఏర్పాటుకు అనుమతి కోసం అభ్యర్థించినట్టు తెలిసింది. దక్షిణకొరియా భారీ మొత్తంలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే దక్షిణ కొరియాకు చెందిన అంతర్జాతీయ స్థాయి లోవస్త్ర ఉత్పత్తి రంగంలో పేరు ప్రఖ్యాతి పొందిన సంస్థల ప్రతినిధుల బృందం గత ఆగస్టులో కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లాయి. పెద్ద ఎత్తున యూనిట్లు ఏర్పాటు చేయడానికి కొరియా ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. అలాగే తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలకు చెందిన వస్త్ర ఉత్పత్తుల రంగంలో పేరు ప్రఖ్యాతి పొందిన సంస్థల ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన స్థలాల కేటాయింపు కోసం దరఖాస్తులు చేసినట్లు తెలిసింది.
Post Views: 517