ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 25న పార్టీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ముఖ్యనాయకులతో సమావేశం కానున్నారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ బుధవారం ఉదయం 10:00 గంటల నుంచి 11:30 గంటల వరకు ఈ సమావేశం జరుగుతుందని వైఎస్సార్ సీపీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఎస్సీ, ఎస్టీ ముఖ్యనాయకులు సమావేశానికి హాజరు కావాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి అంశాలమీద పార్టీ మేనిఫెస్టోను నిర్ణయించే బాధ్యత నాయకులకు అప్పగించనున్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో ఏమేమి ఉండాలనే దానిపై సలహాలు, సూచనలు ప్రజల నుంచి, ఆయా వర్గాల నుంచి తీసుకునే బాధ్యత కూడా నాయకులకు అప్పగిస్తారు.