ఎంతో కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు గురువారం పట్టాలెక్కింది. విశాఖనుంచి విజయవాడకు నడిచే ఈ రైలును కేంద్ర రైల్వే సహాయమంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి, ఎంపీలు, రఘురామ కృష్ణంరాజు, ఎంవీవీ సత్యనారాయణ, గొట్టేడి మాధవి, జీవీఎల్ నర్సింహారావు ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్ 1వ ప్లాట్ఫాంపై రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ ఒక రోజు స్పెషల్ ఎక్స్ప్రెస్గా ఇది నడుస్తుందని శుక్రవారం నుంచి రెగ్యులర్ రైలుగా వారానికి ఐదురోజులు (ఆది, గురువారం తప్ప) నడుస్తుంది. ఎన్నో ప్రత్యేకతలతో ప్రారంభమైన ఈరైలుకు విశాఖ నుంచి విజయవాడకు టిక్కెట్ 525 రూపాయిలగా నిర్ణయించారు. నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణం రాజు ఇదే ట్రైన్ లో తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లి గూడెం వరకు ప్రయాణించారు. సాయంత్రం 5గంటల కల్లా విజయ వాడ చేరుకొంటుంది. విశాఖపట్నం – విజయవాడ మధ్యన ఉదయ్ ఎక్స్ప్రెస్ దూసుకెళ్లుతోంది.
ఐదున్నర గంటల ప్రయాణం వారానికి ఐదు రోజులు 22701/22702 నెంబర్తో నడిచే ఈ డబుల్ డెక్కర్ రైలు విశాఖ నుంచి విజయవాడ చేరుకోవడానికి దాదాపు ఐదున్నర గంటల సమయం తీసుకోనుంది. 9ఏసీ బోగీలు ప్రయాణీకులకు అనుకూలంగా తీర్చిదిద్దారు రైల్వే అధికారులు. శతాబ్ధి ఎక్స్ప్రెస్ రైలులానే ఇందులో ఆధునిక సౌకర్యాలతో సీటింగ్ సౌకర్యం ఏర్పాటుచేశారు. ఈ రైలులో ప్రయాణం అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు రైల్వే అధికారులు. ఆమేరకు అన్ని ఏర్పాట్లు చేసారు. ప్రతి కోచ్లో రైలుకు సంబంధించిన వేగం ఎప్పటికప్పుడు తెలియజేయడంతో పాటు నెక్ట్స్ వచ్చే స్టేషన్ వివరాలు తెలుసుకునేలా ఆరు డిస్ప్లే మానిటర్లు ఏర్పాటుచేసారు. అంతేకాదు టీ, కాఫీ వెండింగ్ మెషీన్లు కూడా అందుబాటులో ఉంచారు.
విశాఖ – విజయవాడ రూట్లో నడిచేటప్పుడు 22701 ట్రైన్ నెంబర్గా ప్రయాణీకులకు సేవలు అందించే ఉదయ్ ఎక్స్ప్రెస్.. విశాఖపట్నంలో ఉదయం 11 గంటల 30 నిమిషాలకు బయలుదేరి విజయవాడకు సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు చేరుకోనుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 22702 నెంబరుతో విజయవాడలో సాయంత్రం 5గంటల 30నిమిషాలకు బయలు దేరి రాత్రి 11గంటలకు విశాఖపట్నం రీచ్ అవుతుంది. మధ్యలో దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్లలో ఆగుతుంది.