ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందని.. ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నామని.. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదన్నారు. కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాల వలన సమస్యలను కొనితెచ్చుకున్నట్లే కాబట్టి వాటికి చట్టబద్ధత ఉండదని, ఎప్పటికీ పట్టా రాదని, చట్టాలు దీనికి అంగీకరించవన్నారు. నగరాలు, మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలపై జగన్ చర్చించారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థాల తొలగింపు, మురుగునీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణ ఇతర సదుపాయాలపై చర్చించారు.
వీటికోసం కొనసాగుతున్న ప్రాజెక్టులు, చేపట్టాల్సిన పనులపై అధికారులతో సమీక్షించారు. ప్రతి మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండాలని, మురుగునీటి శుద్ధి ఉండాలన్నారు. తాగునీటి పైపులైన్లు డ్రైనేజీతో సంబంధం లేకుండా చూసుకోవాలని, నగరాల్లో వ్యర్థాల సేకరణ సరిగ్గా లేదన్నారు. వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థను పూర్తిగా వినియోగించుకోవాలని, తాగునీరు, డ్రైనేజి, ఇళ్లు, కరెంటు, రేషన్ కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీపై గ్రామ, వార్డు సచివాలయాలు దృష్టిపెట్టాలన్నారు. ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కారం చేయాలన్నారు. అలాగే తాడేపల్లి, మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలుగా రూపొందించడంపై చర్చించారు. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీరు. రోడ్ల అభివృద్ధి కోసం సీఎం చర్చించారు. తాడేపల్లి, మంగళగిరిలో ఇళ్లులేని పేదలకు గృహాలు మంజూరు చేయాలని, తాడేపల్లిలో కనీసం 15 వేల ఇళ్లు ఇవ్వాలన్నారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలివ్వాలని సూచించారు.
కృష్ణానది కట్టమీద, కరకట్టలోపల, కాల్వ గట్లమీద ఉంటున్న వారికి శాశ్వతంగా సమస్య పరిష్కరించాలన్నారు. కాల్వ గట్లపై మొక్కలను విస్తారంగా పెంచాలని, పేదలకు మంచి సౌకర్యాలు కల్పించడం ద్వారానే ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దడానికి సాధ్యమవుతాయన్నారు. మున్సిపల్ ఆఫీసుల్లో లంచాల వ్యవస్థ లేకుండా నియంత్రించాలన్నారు. ఏ పౌరుడు లంచం ఇచ్చి పనులు చేయించుకునే పరిస్థితి ఉండకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.