తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం గత కొన్ని రోజులనుండి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ రోజు రేవంత్ పార్టీ మార్పు పై స్పష్టత రానున్నది. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , తెలుగుదేశం జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హైదరాబాద్లో లేక్వ్యూ గెస్ట్హౌజ్లో టీడీపీ పొలిట్బ్యూరోతో సమావేశమైన సంగతి తెలిసిందే . ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు.. ఒకవైపు ఉంటే.. రేవంత్రెడ్డి ఒక్కడే మరోవైపు కూర్చున్నట్టు సమాచారం.
ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ నేతలంతా ఒక్కతాటిపై నిలబడి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని ముఖ్య సమాచారం.గత వారం రోజుల క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని రేవంత్రెడ్డి కలిశారని, పార్టీ వీడేందుకు సిద్ధమయ్యాడని ఫిర్యాదుచేశారు. వివరణ ఇవ్వాలని కోరితే, అడిగేందుకు మీరెవరని వ్యక్తిగత ఆరోపణలు చేశారని పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు వివరించినట్టు సమాచారం. రేవంత్ కలుగజేసుకుని ఏదో చెప్పబోతుండగా చంద్రబాబు వారించినట్టు తెలిసింది.తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు బాగాలేవని, ప్రస్తుతం పరిష్కరించేస్థితిలో తాను లేనని, శనివారం అమరావతికి రండి.. అక్కడే మాట్లాడుతానని సమావేశాన్ని అర్ధంతరంగా ముగించినట్టు తెలిసింది. తనను బద్నాం చేయడానికి పార్టీనేతలు విషప్రచారం చేస్తున్నారని, చర్చించేందుకు ఏకాంత సమయం ఇవ్వాలని రేవంత్రెడ్డి కోరగా చంద్రబాబు తిరస్కరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రేవంత్రెడ్డి శనివారం అమరావతి సమావేశానికి హాజరవుతారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమావేశంతో రేవంత్ రెడ్డి ఏ పార్టీలో కొనసాగుతాడో తేలిపోతుందని నేతలు భావిస్తున్నారు.