తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఔదార్యాన్ని చాటుకున్నారు. చావుబతుకుల్లో ఉన్న చిన్నారి వైద్యం కోసం ట్విట్టర్లో చేసిన పోస్ట్కు వారం రోజుల క్రితమే స్పందించిన ఆయన, సీఎం సహాయ నిధి నుంచి శుక్రవారం రూ.3.50 లక్షల ఆర్థికసాయం అందించారు.
సిరిసిల్ల పట్టణ పరిధిలోని చిన్నబోనాలకు చెందిన వ్యవసాయ కూలీ కాశెట్టి అనిల్-సౌమ్య దంపతుల రెండున్నరేళ్ల కూతురు ఆద్యశ్రీ కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నది. ఒక్కగానొక్క బిడ్డ కోసం ఇప్పటికే అప్పులు చేసి రూ.5 లక్షలకుపైగా వెచ్చించారు.
ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతుండగా, వైద్యంకోసం చిల్లిగవ్వ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ నెల 21న ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ను కోరగా వెంటనే స్పందించారు.
చిన్నారిని స్టార్ దవాఖానకు తరలించి, వైద్యానికి సీఎమ్మార్ఎఫ్ రూ.3.50 లక్షలను శుక్రవారం మంజూరు చేశారు. కేటీఆర్కు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.