తెలంగాణ కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ ఒంటేరుపై గులాబీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ పై గజ్వేల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఒంటేరు పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా కాంగ్రెస్ను వీడి గులాబీ గూటికి చేరారు.
ఈ సందర్భంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సంక్షేమ పథకాలను చూసే టీఆర్ఎస్ చేరానని తెలిపారు. ’నేను ఎమ్మెల్యేగా గెలవాలనే తాపత్రయంతో కొట్లాడాను కానీ.. సీఎం కేసీఆర్ ను ఓడించాలని ఎప్పుడూ అనుకోలేదు’ అని అన్నారు. అహర్శిశలు కష్టపడి పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు. “సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అందువల్లే రెండు సార్లు ఓడిపోయానని తెలిపారు. సీఎం ప్రాతినిథ్యం వహించడం గజ్వెల్ ప్రజలు చేసుకున్న అదృష్టం. నాలుగేళ్లలో గజ్వెల్ రూపురేఖలు మారిపోయాయి. ప్రజలు అడగకుండానే సీఎం కేసీఆర్ ఎన్నో పనుల చేశారు. పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తా` అని పేర్కొన్నారు.