ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో భేటీ అయ్యారు. మరికొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్న నేపధ్యంలో వీరి భేటీ హాట్ టాపిక్గా మారింది. బుధవారం అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్న చంద్రబాబుకు రామోజీ కోడలు, మార్గదర్శి ఎం.డి శైలజా కిరణ్ స్వాగతం పలికారు. అనంతరం తర్వాత చంద్రబాబు రామోజీరావుతో సుమారు 2 గంటలపాటు భేటీ అయ్యారు తాజా రాజకీయ అంశాలు కూడా ప్రధాన ఎజెండాగా జరిగాయట.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.
ఏయే పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి టీడీపీ ఓడిపోతే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, కేంద్రంలో చంద్రబాబు ఎలా వ్యవహరించాలి.. సెంట్రల్ లో హంగ్ వస్తే ప్రధాన అభ్యర్థిగా ఎవరికి మద్దతివ్వాలి అనే అంశాలపై చర్చజరిపి శరద్ పవార్ లేదా మమతా బెనర్టీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. చంద్రబాబే ప్రధానమంత్రి అభ్యర్థి అయితే ఇతరపార్టీల నుంచి అసలు మద్దతు ఉంటుందా అనే అంశాలపై చర్చించారట.. దాదాపుగా ఎవరూ కనీసం అంగీకరించే పరిస్థితి ఉండదని అర్ధమైందట. వైసీపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎటువంటి పరిణామాలపై దృష్టి పెట్టాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం.
అలాగే కేంద్రంలో బీజేపీకి మద్దతివ్వడం అనివార్యమైతే ప్రధాని అభ్యర్థిగా మోడీగాకుండా నితిన్ గడ్కరీ అయితేనే మద్దతిస్తామంటూ రాజగురువుతో చంద్రబాబు చర్చించినట్టు సమాచారం. అయితే టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ను కాపాడడానికే ఇద్దరూ భేటీ అయ్యారని ఓ ప్రధాన పత్రిక కూడా కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎదురుదాడికి దిగాలని, ఇందుకు స్కెచ్ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. రాజగురువు రామోజీతో చంద్రబాబు కలయిక పట్ల ఎక్కువశాతం మాత్రం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తనకు అత్యంత బలమైన రక్షణ కవచంగా నిలిచిన మీడియాను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్న మేరకే చంద్రబాబు ఈ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.