దివంగత ముఖ్యమంత్రి, రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్పవం కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లాలో జమ్మల మడుగులో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఓ పధకం పేరుపట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. కోట్లాదిమంది గుండెల్లో ఉన్న మహనీయుని పేరు పక్కన సున్నా అనే పదం సరికాదంటున్నారు. వివరాల్లోకి వెళ్తే అన్నదాతలు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో సీఎం జగన్ జమ్మలమడుగు సభలో మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా వైఎస్సార్ “రైతు భరోసా”, “వైఎస్సార్ సున్నా వడ్డీ” పథకాలకి శ్రీకారం చుట్టారు.. రైతులకు రూ.84,000 కోట్ల రుణాలు ఇస్తామని, ఆ రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తే వాటిపై వడ్డీ కట్టాల్సిన పనిలేదని వెల్లడించారు..
వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.12,500 అందజేస్తామని, “వైఎస్సార్ సున్నా వడ్డీ” కింద రైతులకు సున్నావడ్డీకే రుణాలిస్తామన్నారు. పధకాల తీరు బాగానే ఉండనున్నా పేరు బాలేదని వైఎస్సార్ అభిమానులు పెదవివిరుస్తున్నారు. సోషల్ మీడియాలోనూ సీఎంకు విన్నవిస్తున్నారు. వైఎస్సార్ పేరు పక్కన సున్నా అనే పదం సరికాదంటున్నారు. వెంటనే “వైఎస్సార్ సున్నా వడ్డీ” పేరును “వైఎస్సార్ వడ్డీ లేని రుణాలు” గా మార్చాలని కోరుతున్నారు. సీఎంకు ఈ విషయం చేర్చాలని పధకాల పేర్లు ప్రజల్లో బాగా నాటుకుపోయే అవకాశం ఉంది కాబట్టి పధకాలకు పేర్లు సూచించేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నారు.