తెలంగాణ రాష్ట్ర మంత్రి గుంటకంట్ల జగదీష్ రెడ్డి సూర్యపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు మంగళవారం జిల్లా నీటిపారుదల, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారులతో పాటు ఎన్సీపీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..” జిల్లాలోనే చెరువులన్నీ నీటితో కళకళాడాలి. చెరువుల నీటితో పల్లెలు గ్రామాలు బాగుపడాలి. రైతన్నలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం”ఆని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం మండలాల వారీగ సమీక్షించి ఇప్పటివరకు నిండిన.. నిండుతున్న చెరువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీళ్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో క్షేత్ర స్థాయిలో పర్యటించి చెరువుల వివరాలను.. నీటి నిల్వ వివారాలను నమోదు చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశించారు.
రైతుల కోరికమేరకు సరిపడా నీటిని వదలాలి అని కూడా ఆయన సూచించారు.ఇప్పటి వరకు జిల్లాలో గోదావరి జలాలతో 191 చెరువులు నిండగా మరో 124 చెరువులు పురోగతి లో ఉన్నట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అంతే గాకుండా మరో 59 చెరువులు నింపాల్సి ఉందని అధికారులు మంత్రికి వివరించారు.యస్ ఆర్ యస్ పి కింద ఉన్న డి బి యం 69,70,71ల పరిధిలో ఉన్న చెరువుల తో పాటు టెల్ ఎండ్ కాకతీయ మెయిన్ కెనాల్ కాలువలపై ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన స్థానిక ఎమ్మెల్యేలు ,కలెక్టర్ అమయ్ కుమార్ ,జాయింట్ కలెక్టర్ సంజీవ్ రెడ్డి ,ఆర్ డి ఓ మోహన్ రావు నీటి పారుదల అధికారులు హమీద్ ఖాన్ ,సుధీర్ తదితరులు పాల్గొన్నారు.