తాజాగా ‘ఖైదీ’ సినిమాతో తమిళ్, తెలుగు సినీ పరిశ్రమలలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు హీరో కార్తీ.ఇప్పుడు మలయాళ దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వస్తున్న దొంగ సినిమాను వయాకామ్18 సమర్పిస్తోంది. తమిళంలో ‘తంబి’ టైటిల్తో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసింది.
సెంటిమెంట్, ఫైట్స్, లవ్.. ఇలా అన్నింటిని ట్రైలర్ లో చూపించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంలో జ్యోతిక, కార్తీ అక్క తమ్ముళ్ళుగా నటిస్తున్నారు. ఇక చిత్ర ట్రైలర్ ని చూస్తుంటే చిన్నప్పుడు కుటుంబం నుంచి వెళ్ళిపోయినా జ్యోతిక తమ్ముడు ఓ పదిహేనేళ్ళ తర్వాత కార్తీ రూపంలో వస్తాడు. అసలు అతడు నిజంగా జ్యోతిక తమ్ముడా కాదా అన్నది మెయిన్ పాయింట్ గా సినిమా నడుస్తుందని తెలుస్తుంది. ఇక ట్రైలర్ లో డైలాగ్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో ‘అక్క ఉంటే.. ఇద్దరు అమ్మలతో సమానం’ అన్న డైలాగ్ ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రంలో సత్యరాజ్ , షావుకారు జానకీ , నికిలా విమల్ , రమేష్ తిలక్ ప్రధాన పాత్రలలో కనిపిస్తున్నారు. సినిమాని క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు తెలుగు తమిళ్ లో ఒకే రోజు విడుదల కానున్నది. కార్తీ , జ్యోతిక నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.