ఈ దేశానికి, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఫ్లోరైడ్ తో నల్గొండ జిల్లాలో లక్షల మంది బాధ పడుతుంటే కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని కానీ ఇప్పుడు కపట ప్రేమను చాటుతున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లా టీడీపీ నేతలు కంచర్ల భూపాల్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డితో పాటు పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ప్రతి ఉపఎన్నికలో ప్రతిపక్షాల మాడు పగిలేలా ప్రజలు తీర్పు ఇస్తున్నారని, సీఎం కేసీఆర్ కు అండగా నిలుస్తున్నారని కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ తామే ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకుంటోందని అయితే…1969లో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను పిట్టల్లా కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ది కాదా..? అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా, తెలంగాణను బలవంతంగా కలిపింది కాంగ్రెస్ పార్టీ కాదా..? అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో ప్రజల నడుములు విరుగుతుంటే జానారెడ్డి, ఉత్తమ్కుమార్ ఎప్పుడన్నా పట్టించుకున్నారా..? అని నిలదీశారు. ఎన్నికలు ఎన్నిసార్లొచ్చినా కాంగ్రెస్కు ఘోరపరాజయం ఎదురైందన్నారు. రాష్ట్రంలో టీడీపీ చచ్చిపోయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. ఇకనుంచి వ్యవసాయానికి కూడా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఈ చేరిక సందర్భంగా మంత్రులు ఈటల రాజేందర్, జగదీష్రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, గుత్తాసుఖేందర్రెడ్డి, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.