జీఎస్టీ పై ఈ నెల 10న సమావేశం కానున్న జీఎస్టీ కౌన్సిల్ సామాన్యులకు మేలు కలిగే నిర్ణయాలను తీసుకునేందుకు కేంద్ర సర్కారు సిద్ధమవుతోంది. నిజానికి ఒకే దేశం.. ఒకే పన్ను.. ఇదే ఆలోచనతో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీని అమలులోకి తెచ్చింది. అప్పటికే నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై జీఎస్టీ పెను ప్రభావం చూపింది.
చిరు వ్యాపారులు మొదలుకొని వినియోగదారుల వరకు అనేక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం మోదీ సర్కారును ఆలోచనలో పడేసింది.ఈ ఏడాది జూలై 1న జీఎస్టీ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ప్రతినెల సమావేశం అవుతున్న జీఎస్టీ మండలి ఇప్పటివరకు సుమారు 100 వస్తువుల ధరలను తగ్గించింది. ఇదే క్రమంలో ఈ నెల 10న మరోసారి భేటీ కానుంది. మధ్య తరగతికి ఉపసమనం కలిగించేలా కౌన్సిల్ నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాల సమాచారం.