బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్నతో దాదాపు 20 నెలలపాటు వెర్రెత్తిపోయారు ప్రేక్షకులు. అయితే, ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్ 28న ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. అయితే, ఈ సినిమా విడుదలయ్యాక, ప్రేక్షకులకు కొత్త సందేహం పుట్టింది. బాహుబలి రెండు భాగాల్లోనూ బల్లాలదేవ భార్య ఎవరన్నది చూపించకపోవడంతో దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు పేలాయి. ఇప్పుడు గరుడవేగ సినిమాకు సంబంధించి ఇలాంటి ప్రశ్నే ప్రేక్షకుల మెదడును తొలిచేస్తోంది. బాహుబలి ప్రశ్నల్తో పోలుస్తూ.. గరుడవేగ మీద కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తుండటం విశేషం.
గరుడవేగలో హీరోకు క్యాన్సర్ ఉందా? లేదా? అన్నదే ఇప్పుడు ప్రేక్షకులను తొలిచేస్తున్న ప్రశ్న. ఇందులో డాక్టర్ పాత్రలో పృధ్వీ కనిపించి హీరోకు సంబంధించిన రిపోర్ట్ చూసి క్యాన్సర్ ఉందా? లేదా? అని కచ్చితంగా చెప్పకుండా తన గొడవేంటో చెబుతుంటాడు. ఆ రిపోర్టు చూసిన హీరో పై అధికారి క్యాన్సర్ అంటాడు. దీని మీద అక్కడక్కడ కొంచెం కామెడీ నడుస్తుంది. ప్రీ క్లైమాక్స్లో సినిమా సీరియస్గా నడుస్తున్నప్పుడు కూడా ఈ తమాషా కొనసాగుతుంది.
అయితే, నిజంగా హీరోకు క్యాన్సర్ ఉందా? లేదా? అన్నది మాత్రం స్పష్టత ఇవ్వరు. మరి హీరోకి క్యాన్సర్ అనే అంశాన్ని కేవలం కామెడీ కోసం అలా వాడుకున్నారా..? లేక నిజంగా అతనికి క్యాన్సర్ ఉందా? అన్నది స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయాన్ని ట్విట్టర్లో ఓ వ్యక్తి ప్రస్తావిస్తే హీరోకు క్యాన్సర్ ఉందా? లేదా? అన్నది తనకూ తెలియదని, డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ను అడగాలని హీరో రాజశేఖర్ చెప్పడం విశేషం.