తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మంచి నీటి కొరత లేకుండా చేశామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. నగరంలో మంచినీటి సమస్య లేదన్నారు. మంచినీటి సరఫరా విషయంలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో గత సంవత్సరంలోనే వెయ్యి కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. జీహెచ్ఎంసీ మీద భారం పడకుండా లక్ష ఇండ్లు కట్టబోతున్నామని తెలిపారు. లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లకు రూ. 8,650 కోట్లు కేటాయించామన్నారు. ఇండ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. రాత్రికి రాత్రే విశ్వనగరాలు తయారు కావు అని స్పష్టం చేశారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి.. అందుకనుగుణంగా కృషి చేస్తున్నామని ఉద్ఘాటించారు. సిటీలో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిచామని చెప్పారు. జీహెచ్ఎంసీలో అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
