దేశంలోని మెట్రోరైలు ప్రాజెక్టుల రికార్డులన్నీ చెరిపేస్తూ.. హైదరాబాద్ మెట్రోరైలు సరికొత్త చరిత్రను సృష్టించనున్నది. త్వరలో నాగోల్-మియాపూర్ మధ్య 30 కిలోమీటర్ల మేర ఆపరేషన్స్ మొదలుపెట్టి దేశంలోనే అతిపెద్ద మార్గంలో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించిన మెట్రోగా రికార్డు సొంతం చేసుకోనున్నది. ఇప్పటివరకు 13.4 కిలోమీటర్ల ప్రారంభ ఆపరేషన్స్తో కొచ్చి మెట్రో ఆరునెలల కిందట నెలకొల్పిన రికార్డును మన మెట్రో తుడిచిపెట్టనున్నది. నాగోల్-మెట్టుగూడ మధ్య 8 కి.మీలు, మియాపూర్-ఎస్సార్నగర్ మధ్య 10 కి.మీల మార్గం గతంలోనే పూర్తయినా ఆపరేషన్స్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు. తుకుడ.. తుకుడలతో ఏం లాభం.. నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు ఎవరెక్కుతరు.. కనీసం ఎల్బీనగర్కు సికింద్రాబాద్కు లింకులేదు.. మధ్యలెక్కి మధ్యల ఎవరు దిగుతరు. వీలైనంత ఎక్కువదూరం రైళ్లను నడుపండి.. లేటైనా ఫర్వాలేదు అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు మెట్రో అధికారులు మెట్టుగూడ-ఎస్సార్నగర్ మధ్య మెట్రో మార్గాన్ని పూర్తిచేసి నాగోల్-మియాపూర్ 30 కి.మీల మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. కోల్కతాలో 1984 మొదటి మెట్రోరైలు ప్రారంభం కాగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తొమ్మిది మెట్రోలు నడుస్తున్నాయి. మనది పదో మెట్రోగా రికార్డుల్లో చేరబోతున్నది.
ఓసారి మిగతా మెట్రోల రికార్డులను పరిశీలిస్తే..
కోల్కతా.. 3 కి.మీ.
కోల్కతా మెట్రో కమర్షియల్ ఆపరేషన్స్ను 1984లో ప్రారంభించారు. దేశంలోనే ఇది తొలి మెట్రో ప్రాజెక్టు. నౌపర- కావి సుభాష్ మధ్య మూడు కి.మీ మార్గంలో ఆపరేషన్స్ మొదలయ్యాయి.
ఢిల్లీ.. 8 కి.మీ.
దేశంలో ఆధునిక మెట్రోలకు మార్గనిర్దేశనం చేసిన ఢిల్లీ మెట్రోను 2002 డిసెంబర్ 24న ప్రారంభించారు. మొదట దిల్షాద్గార్డెన్స్-రితాలా మధ్య 8 కి.మీల మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ముంబై.. 11 కి.మీ.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2014 జూన్ 8వ తేదీన వెర్సోవా-అంధేరి-ఘట్కోపర్ మధ్య 11 కి.మీల మార్గంలో మొదటి మెట్రో పరుగులు పెట్టింది. ప్రాజెక్టులో మొత్తం 216 కి.మీలు 11 కారిడార్లను ప్రతిపాదించగా, ప్రసుత్తం ఒకేలైన్లో ఆపరేషన్స్ నడుస్తున్నాయి. మరో మూడు కారిడార్లు నిర్మాణంలో ఉన్నాయి. రోజూ 3.6 లక్షల మంది మెట్రోను వినియోగించుకుంటున్నారు.
చెన్నై.. 10 కి.మీ.
చెన్నైలో 2015లో మెట్రో తొలికూత పెట్టింది. మొదట కోయంబేడు -ఆలందూరు మధ్య 10 కి.మీల మేర ప్రారంభం కాగా, 27.88 కి.మీలకు విస్తరించారు.
బెంగళూరు.. 7 కి.మీ.
బెంగళూరు మెట్రోను నమ్మమెట్రో పేరుతో 2011లో 7 కి.మీల మేర ప్రారంభించారు. బియ్యప్పనహళ్లి-మహాత్మాగాంధీరోడ్ మధ్య తొలిమెట్రో తిరిగింది. తర్వాత 42.3 కి.మీలు 41 స్టేషన్లకు విస్తరించారు. 3
గుర్గావ్.. 5 కి.మీ.
ఢిల్లీ మెట్రోతో గుర్గావ్ పట్టణాన్ని అనుసంధానం చేయడానికి వీలుగా గుర్గావ్ మెట్రో 11.7 కి.మీలతో మెట్రో ప్రాజెక్టును ప్రతిపాదించారు. 2013లో 5 కి.మీల మేర సికిందర్పూర్- ఢిల్లీమెట్రో ఎల్లోలైన్ మధ్య మొదటిదశ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మార్చిలో మరో 6.7 కి.మీల మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు.
జైపూర్.. 10 కి.మీ.
జైపూర్లో 2015 జూన్ 3వ తేదీన మానసరోవర్-చాంద్పోల్ మధ్య (10కి.మీ.) మొదటి మెట్రో తిరిగింది. 9 స్టేషన్ల మధ్య రోజూ 19 వేల మంది రాకపోకలు సాగిస్తున్నాయి.
లక్నో.. 8 కి.మీ.
ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభమైన లక్నో మెట్రోను ట్రాన్స్పోర్ట్నగర్-చార్బాగ్రైల్వే స్టేషన్ల (8 కి.మీ) మధ్య తిప్పుతున్నారు. మరో 27 కి.మీల మార్గం నిర్మాణదశలో ఉన్నది.