టీచర్ల ఉద్యోగాల భర్తీని పది జిల్లాల ప్రకారం చేపట్టేందుకు త్వరలో టీఆర్టీ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఏజన్సీ, వెనుకబడిన జిల్లాల నిరుద్యోగుల లబ్ది కోసమే కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చామని…అయితే హైకోర్టు ఆదేశాలకు లోబడి పది జిల్లాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. సచివాలయంలో మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మీడియాతో కొంతమంది కావాలని ప్రతిదానికి కోర్టుకు వెళ్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
పది జిల్లాలకు అయినా, 31 జిల్లాలకు అయినా నోటిఫికేషన్ పై కోర్టుకు వెళ్లడానికి పిటిషన్లు సిద్ధం చేసుకున్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
కొలువుల కొట్లాట ఎవరు చేస్తున్నారో..నాయకులెవరో తమకు తెలుసని ఉపముఖ్యమంత్రి కడియం అన్నారు. వచ్చే ఏడాది ఆగస్టులోపు 1,08,000 పోస్టుల భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పరని తేల్చిచెప్పారు. త్వరలో ఈ భర్తీపై క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు. ఇప్పటికే 29వేల పోస్టులు భర్తీ చేశాం..అనుమానముంటే ఆర్టీఐ కింద తెలుసుకోవాలని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు దురదృష్టకరమని..ఆత్మహత్యలను ఖండిస్తున్నామని ఉపముఖ్యమంత్రి కడియం వెల్లడించారు.
విద్యార్థుల తమ సమస్యలకు పోరాడి గెలవాలని..ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఉపముఖ్యమంత్రి కడియం విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలను ఏ ప్రభుత్వం ప్రోత్సహించదని, వాటిని పార్టీలు రాజకీయం చేయవద్దని ఆయన కోరారు. ఓయూ విద్యార్థి సుసైడ్ లెటర్, అతని చేతిరాతను పోల్చి చూస్తే..నకిలీయో, అసలో తేల్తుంది..మరి అది ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. సిద్ధాంత విబేధాలున్నవాళ్లంతా కలిసి పనిచేస్తున్నారంటే..వారి వెనుక ప్రజలు లేరని తేలిందని అన్నారు. ప్రతిపక్షాలు భావ దారిద్ర్యంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు.